నాగార్జున ప్రసన్న ఓ అంతులేని కథ

నెలలు గడిచిపోతున్నా నాగార్జున కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుపెట్టలేదు. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్లాన్ చేసుకున్న మలయాళం రీమేక్ పోరింజు మరియం జోస్ స్క్రిప్ట్ పనులు పూర్తయినప్పటికీ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి నాగ్ తటపటాయిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఫైనల్ వెర్షన్ బాగానే వచ్చినప్పుడు కథలో ఉన్న సెన్సిబిలిటీస్, మాస్ ఎలిమెంట్స్ ని ప్రసన్న ఎంత వరకు హ్యాండిల్ చేయగలడనే అనుమానం మీదే పెండింగ్ పెడుతున్నారని వినిపిస్తోంది. జనవరితో మొదలుపెట్టి ఆరు నెలలుగా ఇదే కథ రిపీట్ అవుతోంది.

ఒకవేళ ఈ నెల రెండు లేదా మూడో వారం మొదలైతే ఈ ప్రాజెక్టు మీద నమ్మకం పెట్టుకోవచ్చు. తమ ఫ్యామిలీకి వరసగా ఎదురువుతున్న డిజాస్టర్ల దృష్ట్యా నాగార్జున ఎలాంటి తొందరపాటు ప్రదర్శించే ఆలోచనలో లేరు. తమ స్టోరీ సెలక్షన్ పట్ల అభిమానుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురు కావడం ఆయన దృష్టికి వెళ్లకుండా ఉండదు. కొందరు ఫ్యాన్స్ ఏకంగా అక్కినేని హీరోలు మాకొద్దంటూ కొద్దిరోజులు ట్వీట్లతో హల్చల్ చేశారు. ఏజెంట్, కస్టడీ రిజల్ట్స్ వచ్చాక ఇది మరింత ఎక్కువయ్యింది. అందుకే ప్రసన్న వెర్షన్ ఒకటికి పదిసార్లు కాచి వడబోస్తున్నారని యూనిట్ మాట.

ప్రస్తుతం నాగార్జున బయట కనిపిస్తున్న గెడ్డం లుక్ ఈ మూవీ కోసమే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్లాష్ బ్యాక్, వర్తమానం రెండింటిని అనుసంధానిస్తూ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటుంది. సెకండ్ హీరో కోసం అల్లరి నరేష్ ఆల్రెడీ లాక్ అయ్యాడు. డేట్లు ఇంకా తీసుకోలేదు. నాగ్ పచ్చజెండా ఊపేస్తే ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకుంటారు. అసలు సమస్య మరొకటి ఉంది. చాలా కీలకమైన కథలో కేంద్ర బిందువుగా నిలిచే హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. చూస్తుంటే ఈ అంతులేని కథకి క్లైమాక్స్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.