బాలు చెప్పాడని పంతం వీడిన పట్నాయక్

సినీ రంగంలో ఎంత వైభవం చూసిన టెక్నీషియన్లు అయినా ఒక దశ దాటాక స్లో అవడం మామూలే. నెమ్మది నెమ్మదిగా అవకాశాలు ఆగిపోగానే వారి కెరీర్ ముగిసిపోతుంటుంది. ఐతే ఒకప్పటి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన ఆర్పీ పట్నాయక్‌ మాత్రం.. ఫామ్‌లో ఉండగానే తనకు తానుగా సంగీతానికి దూరమయ్యాడు. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌కి గట్టి పోటీదారుగా ఉన్న పట్నాయక్..
తర్వాత కొంచెం జోరు తగ్గించినప్పటికీ.. తనకింకా డిమాండ్ ఉండగానే సంగీతాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు.

దర్శకుడిగా మారి సినిమాలు తీయడం వల్లేమీ ఆయన సంగీతాన్ని వదిలేయలేదు. తన వల్ల సినిమాకు నష్టం జరుగుతోందంటూ ఒక నిర్మాత కామెంట్ చేయడంతో హర్ట్ అయి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆర్పీ వెల్లడించడం గమనార్హం. ఆ నిర్మాత ఎవరని ఆర్పీ చెప్పకపోయినా.. దివంగత శివ ప్రసాద్ రెడ్డి (కామాక్షి మూవీస్ అధినేత) కామెంట్‌తోనే అతను హర్ట్ అయినట్లు తన మాటల్ని బట్టి అర్థమైంది.

ఐతే ఇంత కఠిన నిర్ణయం తీసుకుని దశాబ్దానికి పైగా సంగీతానికి దూరంగా ఉన్న పట్నాయక్.. ఇప్పుడు ‘అహింస’ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇస్తున్నాడు. ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘జయం’ చిత్రాలతో ఆర్పీకి బ్రేక్ ఇచ్చిన తేజనే ఈ చిత్రానికి దర్శకుడు. ఐతే మళ్లీ సంగీతం చేయాలన్న తన నిర్ణయానికి కారణం ఎస్పీ బాలునే అంటున్నాడు పట్నాయక్. “నేను సంగీతాన్ని పక్కన పెట్టేశాక తమ చిత్రాలకు మ్యూజిక్ ఇవ్వాలని చాలా మంది అడిగారు. కానీ చేయాలనిపించలేదు.

ఐతే నేను ఎన్ని పనులు చేసినా.. నాకు గుర్తింపు తెచ్చింది సంగీతమే. నన్ను ఒక సంగీత దర్శకుడిగానే జనం చూస్తారు. నేను ఇక మ్యూజిక్ చేయనని చెప్పి మానేశాను. కానీ బాలు గారు ఎప్పుడు కలిసినా.. మళ్లీ ఎప్పుడు సంగీతం మొదలుపెడుతున్నావనే అడిగేవారు. చేస్తానని చెప్పేవాడిని. బాలు గారు వెళ్లిపోయాక ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే అనిపించేది. అందుకే తేజ గారిని కలిసి ‘నేను మళ్లీ సంగీతం చేయాలి. అది బాలు గారి కోరిక’ అన్నాను. కొన్నాళ్లకు తేజ ఫోన్ చేసి ‘చిత్రం-2’ చేద్దామన్నారు. కానీ తర్వాత అది పక్కకు వెళ్లి ‘అహింస’ వచ్చింది. ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్న” అని ఆర్పీ తెలిపాడు.