మేమ్ ఫేమస్ ట్రోలింగ్‌పై నిర్మాత రియాక్షన్

చిన్న సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో సవాలే. ఐతే ‘మేమ్ ఫేమస్’ అనే చిన్న సినిమాను దాని టీం భలే వెరైటీగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగలిగింది. విడుదలకు ఒక్క రోజు ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేయగా.. ఆ షోలన్నీ ఫుల్స్ అవుతున్నాయంటే విశేషమే. ఛాయ్ బిస్కెట్ అధినేతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సెలబ్రెటీలు చాాలామంది తమ సపోర్ట్ ఇచ్చారు.

వెరైటీ ప్రమోషన్లలో భాగం అయ్యారు. చివరగా శరత్, అనురాగ్‌లతో కలిసి ‘మేజర్’ సినిమాను నిర్మించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ‘మేమ్ ఫేమస్’ గురించి పాజిటివ్ ట్వీట్ వేసి టీంను సంతోషంలో ముంచెత్తాడు. కానీ దీనిపై నెటిజన్లు ఊహించని రీతిలో స్పందించారు. ‘మేమ్ ఫేమస్’ టీంను ట్రోల్ చేశారు.

‘మేమ్ ఫేమస్’ సినిమాను మహేష్ సహా సెలబ్రెటీలంతా మరీ అతిగా పొగుడుతున్నారంటూ సెటైర్లు వేశారు. మహేష్ ట్వీట్ మీద నిర్మాత శరత్ చంద్ర స్పందించిన తీరు.. ఉమ్మడి భాగస్వామ్యంలో మరో సినిమా చేయాలన్న ఆయన ప్రతిపాదనకు మహేష్ ఓకే చెప్పడం.. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిన ప్రమోషన్ అంటూ కౌంటర్లు వేశారు. ఈ ట్రోల్స్ శృతి మించడంతో నిర్మాత శరత్ చంద్ర మీడియాతో మాట్లాడాడు.

రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. “మహేష్ గారు ఈ సినిమాను మెచ్చుకుంటే కొందరు ట్రోల్స్ చేశారు. అసలు ఏం సంబంధం లేని వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం సరైన పద్ధతి కాదు. ఏదైనా పాజిటివ్‌గా మాట్లాడితే అంతా పాజిటివ్‌గా ఉంటుంది. నెగెటివ్‌గా మాట్లాడితే నెగెటివ్‌గా ఉంటుంది. మా సినిమా హీరో, డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ పాజిటివ్‌గా ఆలోచించే వ్యక్తి. తన ప్రతిభతో అతను హీరోగా, దర్శకుడిగా ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు” అని శరత్ చంద్ర పేర్కొన్నాడు.