బాలయ్య తారక్ కలయిక మిస్సయ్యింది

ఇవాళ హైదరాబాద్ కూకట్ పల్లి మైదానంలో జరగబోయే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు టాలీవుడ్ అరుదైన కలయిక కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మెల్లగా నిరాశ కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు. ఇవాళే పుట్టినరోజు కావడంతో ఫ్యామిలీ కమిట్ మెంట్స్ ఇతర వ్యక్తిగత కారణాల రాలేకపోతున్నట్టు నిర్వాహకులకు ముందే చెప్పినప్పటికీ నగరంలో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ఈ కన్ఫ్యూజన్ తలెత్తింది. లిస్టు చాలా పెద్దదే ఉంది కానీ ఎందరు వస్తారో చివరి నిమిషం దాకా తేలేలా లేదు.

నందమూరి అభిమానులు బాగా మిస్ అవుతున్నది మాత్రం బాబాయ్ బాలయ్య అబ్బాయ్ తారక్ ల కలయిక. ఈ ఇద్దరూ ఒకే పబ్లిక్ స్టేజి పంచుకుని ఏళ్ళు దాటిపోయింది. హరికృష్ణ గారు కాలం చేసినప్పుడు దానికి సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే కలిసి కనిపించారు తప్ప బయట ఆ ఛాన్స్ దొరకలేదు. ఇద్దరి మధ్య అంతగా పొసగడం లేదనే ప్రచారానికి చెక్ పెట్టే అవకాశం రావడం లేదని అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్టీఆర్ సెనెటరీ సెలబ్రేషన్స్ దానికి బ్రేక్ వేస్తుందనుకుంటే ఇలా జరిగింది. ఇప్పట్లో ఇలాంటి వేడుక మరొకటి రాకపోవచ్చు.

కళ్యాణ్ రామ్ హాజరవ్వడం దాదాపు ఖాయమే. నందమూరి నారా కుటుంబాలు ఎలాగూ వస్తాయి. తారక్ వచ్చి ఉంటే ఫోటోలు వైరలయ్యేవని సోషల్ మీడియా జనాలు కూడా ఎదురు చూశారు. దేవర షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న జూనియర్ బర్త్ డే ఫ్యామిలీతోనే జరుపుకోబోతున్నట్టు సమాచారం. మరోపక్క సింహాద్రి రీ రిలీజ్ ఓ సంబరంగా జరుగుతోంది. ఉదయం అయిదు నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు మొదలుపెట్టగా చెన్నై రోహిణి థియేటర్లో అర్ధరాత్రి పన్నెండుకే షో వేయడం గమనార్హం. మొత్తానికి బాబాయ్ అబ్బాయ్ ల కాంబో మిస్ అయిపోయింది.