డిమాండ్ పెంచుకుంటున్న జాన్వీకపూర్

ఏ ముహూర్తంలో జూనియర్ ఎన్టీఆర్ 30 ఒప్పుకుందో అప్పటి నుంచి జాన్వీ కపూర్ కెరీర్ మారిపోయినట్టుంది. సౌత్ ఇండస్ట్రీకి రావడంలో విపరీతమైన జాప్యం చేసిన ఈ అతిలోకసుందరి వారసురాలికి మెల్లగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అవి కూడా క్రేజీ కాంబినేషన్లవి కావడంతో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారేలా ఉంది. రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే స్పోర్ట్స్ డ్రామాకు తననే ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. తారక్ తో షూటింగ్ కు మొదలు జరిగిన ఫోటో షూట్ పిక్స్ చూసి సంతృప్తి చెందిన ఆర్సి 16 టీమ్ అధిక శాతం పాజిటివ్ గా స్పందించారట.

ఏజెంట్ డిజాస్టర్ తో విశ్రాంతి కోసం దుబాయ్ వెళ్ళిపోయిన అఖిల్ తర్వాత యువి క్రియేషన్స్ తో చేతులు కలపబోతున్నాడు. డెబ్యూ దర్శకుడి కథ స్క్రిప్ట్ ఎప్పుడో ఓకే అయ్యాయి. ఇప్పుడు మరోసారి రీ చెక్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. ఇందులో కూడా జాన్వీనే నిర్మాతలు రికమండ్ చేస్తున్నట్టు వినికిడి. ఇలా ఇంత మంచి ఛాన్సులు వస్తే ఎవరు మాత్రం వదులుంటారు. అయితే ఇదంతా అఫీషియల్ కావడానికి నెలల సమయం పడుతుంది. తారక్ సినిమా ఈ ఏడాది చివర్లో పూర్తవుతుంది కనక ఈలోగా జాన్వీ వేరే కమిట్మెంట్లు ప్లాన్ చేసుకోవచ్చు.

ఇప్పటికైతే ఇవన్నీ చర్చల్లో ఉన్న వార్తలే తప్ప కన్ఫర్మ్ కాదు. ఒకవేళ జాన్వీ ఒక నాలుగేళ్ల క్రితమే ఇలా ఎంట్రీ ఇచ్చి రెండు మూడు హిట్లు పడితే ఈపాటికే స్టార్ హీరోయిన్ అయ్యేది. బాలీవుడ్ లోనే సెటిలవ్వాలనే లక్ష్యంతో అన్నీ ఫిమేల్ ఓరియెంటెడ్ కథలు చేయడం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. అదే పనిగా కోకోకోకిల, హెలెన్ లాంటివి రీమేక్ చేసుకున్నా ప్రయోజనం దక్కలేదు. ఫైనల్ గా స్టార్లతో జట్టు కడితేనే మంచి ఫ్యూచర్ ఉందని గుర్తించి తల్లి బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకుంది కాబోలు. తమిళ తెరంగేంట్రం కోసం తండ్రి బోనీకపూర్ కథలను వింటున్నారట.