ఏప్రిల్ 28 సెంటిమెంటుకి చరమ గీతం

టాలీవుడ్ సినిమా చరిత్రలో కొన్ని డేట్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటిలో ఏప్రిల్ 28 చాలా స్పెషల్. ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ అడవిరాముడు రిలీజయ్యింది ఈ రోజే. ఇప్పటికీ దీనికి కురిసిన కనకవర్షం గురించి పెద్దోళ్ళు కథలుగా చెబుతారు. మహేష్ బాబు పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన పోకిరి గురించి మళ్ళీ గుర్తు చేయాల్సిన పని లేదు. రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి 2, అలీ లాంటి కమెడియన్ తో యమలీల రూపంలో సిల్వర్ జూబ్లీ కొట్టొచ్చని నిరూపించిన ఎస్వి కృష్ణారెడ్డి సాహసం ఇలా ఎందరో అభిమానులకు ఈ డేట్ తో మంచి సెంటిమెంట్ ఉంది.

ఇప్పుడొచ్చిన ఏజెంట్ తో దానికి చరమ గీతం పడిపోయింది. నిర్మాత అనిల్ సుంకర ప్రమోషన్ల టైంలో దీని గురించే నొక్కి వక్కాణిస్తూ దెబ్బకు అఖిల్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతాడని తెగ ఊరించారు. కట్ చేస్తే రెండో రోజే నైజామ్ లో దారుణంగా క్రాష్ అయ్యేంత పెద్ద డిజాస్టర్ గా ఏజెంట్ రన్ మరీ దీనంగా ఉంది. దెబ్బకు అఖిల్ సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యాడు. ట్రోలింగ్స్ కి అమల ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు కానీ దానివల్ల ఉపయోగం లేదు. నాగార్జున పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. ఫస్ట్ షోకి విషెస్ చెప్పక ఎలాంటి సౌండ్ లేదు

రాబోయే రోజుల్లో ఎవరైనా ఏప్రిల్ 28 లక్కీ డేటని ప్రచారం చేసుకుంటే వెంటనే ఏజెంట్ ఉదాహరణను తీసుకొస్తారు సోషల్ మీడియా జనాలు. ఎందుకంటే ఇది ఇప్పట్లో మాసిపోయే గాయం కాదు. కొన్నేళ్ల పాటు వెంటాడుతూనే ఉంటుంది. గత ఏడాది ఆచార్య, లైగర్ లను మించినవి రావు అనుకుంటే ఈ సంవత్సరం శాకుంతలం, ఏజెంట్ రెండూ వాటిని తలదన్నేలా ఆడుతున్నాయి. కంటెంట్ బలంగా ఉన్నప్పుడు ఇలాంటి సెంటిమెంట్లతో పని లేదు కానీ ఎటొచ్చి కథల ఎంపికలో కుర్ర హీరోలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏజెంట్ మరోసారి హెచ్చరికగా నిలిచింది