మహేష్, అనుష్క.. ఎమోషనల్ పోస్టులు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన తల్లిదండ్రులతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన తండ్రి కృష్ణ పేరెత్తితే చాలు చాలా ఎమోషనల్ అయిపోతుంటాడు మహేష్. అలాగే తల్లి ఇందిరాదేవి విషయంలోనూ ఇంతే ఎమోషన్ చూపిస్తుంటాడు. మహేష్ అంతగా ప్రేమించే ఆ ఇద్దరూ ఒకే ఏడాది కొన్ని నెలల వ్యవధిలో కన్నుమూయడం మహేష్‌కు తీరని లోటే. గత ఏడాది ముందుగా ఇందిర, తర్వాత కృష్ణ కొన్ని నెలల వ్యవధిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

మరణానంతరం ఇందిర తొలి జయంతి ఈ రోజే. ఈ సందర్భంగా మహేష్ ఒక ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి.. ‘‘హ్యాపీ బర్త్‌ డే అమ్మా.. నీకు ప్రతి రోజూ రుణపడి ఉంటాను’’ అంటూ హృద్యమైన పోస్టు పెట్టాడు మహేష్. రెగ్యులర్ పోస్టే అయినప్పటికీ ఇది వైరల్ అయిపోయింది.

మహేష్ తల్లి పుట్టిన రోజు నాడే.. ‘ఖలేజా’ సినిమాలో ఆయనకు జోడీగా నటించిన అగ్ర కథానాయిక అనుష్క తండ్రి బర్త్ డే కావడం విశేషం. అనుష్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ్డం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చాలా చాలా తక్కువ. అలాంటిది తన తండ్రి మీద తనతో పాటు కుటుంబమంతా ప్రేమను కురిపిస్తూ ఒక అందమైన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి.. ‘‘హ్యాపీయెస్ట్ బర్త్ డే పాపలు’’ అని వ్యాఖ్య కూడా జోడించింది. ఈ పోస్టును బట్టి తన తండ్రిని అనుష్క ‘పాపా’ అని పిలుచుకుంటుందని అర్థమవుతోంది.

ఒకప్పటితో పోలిస్తే అనుష్క సినిమాలు బాగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ తర్వాత ఆమె సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. గత ఏడాదే అనుష్క.. నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక సినిమాను మొదలుపెట్టింది. దానికి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.