విఘ్నేష్-నయన్ ప్రేమకథ అలా మొదలైంది..


నయనతార కెరీర్ ఆరంభ: నుంచి కూడా తన సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ముఖ్యంగా ఆమె ప్రేమాయణాలు ప్రతిసారీ పెద్ద చర్చకే తావిచ్చాయి. శింబుతో కొంత కాలం ప్రేమలో ఉన్న ఆమె అతడి శాడిజం భరించలేక ఆ బంధం నుంచి బయటికి వచ్చేసినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి అతడితో పెళ్లికి కూడా సిద్ధమైంది. ఇందుకోసం మతం కూడా మార్చుకుంది. కానీ పెళ్లికి చాలా దగ్గరగా వచ్చాక ఈ బంధం కూడా చెడిపోయింది.

ఇక కొన్నేళ్లకు ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. ఐతే నయన్ స్థాయికి విఘ్నేష్ చాలా తక్కువ అన్న ఫీలింగ్ కలిగి.. ఈ బంధం నిజమా అని చాలామంది సందేహించారు. ఒకవేళ నిజంగా విఘ్నేష్‌తో డేటింగ్ చేస్తున్నప్పటికీ ఈ రిలేషన్‌షిప్‌ ఎక్కువ కాలం సాగదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. కానీ ఆ బంధం చాలా దృఢంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని కవల పిల్లలకు జన్మ కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో నయన్‌తో తన ప్రేమ ఎప్పుడు, ఎలా మొదలైంది.. మొదట్లో తాము ఎలా తమ రిలేషన్‌షిప్‌ను దాచిందీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు విఘ్నేష్. “నా తొలి చిత్రం ‘పోడా పోడి” ఫ్లాప్ కావడంతో నా మీద ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. తర్వాత నేనేంటో రుజువు చేసుకోవాలని ‘నానుం రౌడీదా’ కథ రాశా. దాని గురించి తెలుసుకుని ధనుష్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. నయనతారకు కథ చెప్పమన్నాడు. కానీ నా కథను ఆమె ఒప్పుకోదనుకున్నా. నజ్రియాను సంప్రదించాలనుకున్నా. కానీ ధనుష్ మీద గౌరవంతో నయన్ నా కథ వింది. ఆమెకు నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకుంది. తనకు నరేషన్ ఇస్తున్నపుడే నేను ప్రేమలో పడిపోయా. ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలైనపుడు మా డేటింగ్ కూడా మొదలైంది. చాలా కాలం మా ప్రేమ గురించి ఎవరికీ చెప్పలేదు. మేం చెప్పే వరకు ఈ విషయం వెల్లడి కాలేదు. మా విషయం ఎవరికీ తెలియకూడదని నయన్‌ను అందరి ముందూ మేడమ్ అంటూ చాలా గౌరవించేవాడిని. ఒంటరిగా తన కారవాన్‌లోకి కూడా వెళ్లేవాడిని కాదు. కొంత కాలానికి అందరికీ విషయం చెప్పాం. మా బంధం సాఫీగా సాగింది” అని విఘ్నేష్ తెలిపాడు.