ఎవ్వరూ ఫోన్ చేయలేదు.. సమంత ఆశ్చర్యం


తాను అనారోగ్యంతో ఉన్నపుడు ఇండస్ట్రీ జనాలు స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేసింది సమంత. గత ఏడాది ఆమె మయోసైటిస్ అనే ప్రమాదకర జబ్బుతో పోరాడిన సంగతి తెలిసిందే. దీని వల్ల కొన్ని వారాల పాటు సామ్ ఆసుపత్రిలో ఉంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్ని నెలలు ఇంటికే పరిమితం అయింది. దీంతో ఆమె నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూట్ చాన్నాళ్ల పాటు ఆగిపోయింది. ఆమె ప్రధాన పాత్ర పోషించాల్సిన వేరే సినిమాలు కూడా ఆలస్యం అయ్యాయి. కానీ తన వల్ల ఎంత ఇబ్బంది పడ్డప్పటికీ ఎవ్వరూ కూడా ఫోన్ చేసి షూటింగ్‌కు ఎప్పుడు వస్తావ్ అని ఒక్క మాట కూడా అడగలేదని సమంత చెప్పింది.

“అనారోగ్యంతో నేను చాలా రోజుల పాటు షూటింగ్‌లకు దూరమయ్యాను. నేను ఇబ్బందుల్లో ఉన్నపుడు ఇండస్ట్రీ నాకెంతో సపోర్ట్ చేసింది. ముఖ్యంగా నిర్మాతలు నాకు అండగా నిలిచారు. ఇన్ని రోజులు బ్రేక్ తీసుకున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఫోన్ చేసి ఎప్పుడు షూటింగ్‌కు వస్తావ్ అని ఒక్క మాట కూడా అడగలేదు. నేను అందుబాటులోకి వచ్చే వరకూ ఓపిగ్గా ఎదురు చూశారు. ఇది నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది” అని విలేకరుల సమావేశంలో సామ్ తెలిపింది.

జీవితంలో ఎదురైన సమస్యలు తనను మరింత దృఢంగా మార్చాయని సమంత ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. గత రెండేళ్లలో తన జీవితంలో అనేక ఊహించని పరిణామాలు జరిగాయని.. సమస్యలు ఎదురైనపుడు ముందు ఇబ్బంది పడ్డా.. తర్వాత వాటిలో పడి మనల్ని మనం నాశనం చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని.. ఈ క్రమంలో తాను మునుపటి కంటే చాలా దృఢంగా మారానని.. ఇప్పుడు దేన్నయినా ఎదుర్కోగలం అనే ధైర్యం వచ్చిందని సమంత తెలిపింది.