నంది అవార్డుల‌పై విజ‌యేంద్ర విన్న‌పం

రెండు తెలుగు రాష్ట్రాలు క‌లిసి ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌గా ఉన్న‌పుడు.. సినీ రంగంలోని వారంతా నంది అవార్డుల‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించేవారు. ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వం నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించేది. వీటి ఎంపిక ప‌క‌డ్బందీగా జ‌రిగేది. అవార్డులు గెలుచుకున్న వాళ్ల ఆనందానికి అవ‌ధులు ఉండేవి కావు. నంది అవార్డుల గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకునేవారు.

కానీ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయాక క‌థ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డుల‌ను ప‌క్క‌న పెట్టేసింది. ఏపీలో కొన్నేళ్లు అవార్డులు ఇచ్చినా వాటికి అంత ప్రాధాన్యం ద‌క్క‌లేదు. త‌ర్వాత అవార్డులు ఇవ్వ‌డ‌మే మానేశారు. జ‌గ‌న్ స‌ర్కారు అయితే అస్స‌లు ఈ అవార్డుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల పాల‌కుల‌కు నంది అవార్డుల కోసం సినీ పెద్ద‌లు విన్న‌పాలు చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

చంద్ర‌బాబు హ‌యాంలో నంది అవార్డుల ఎంపిక‌పై ఇటీవ‌ల పోసాని కృష్ణ‌ముర‌ళి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అవుతున్న త‌రుణంలో లెజెండ‌రీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్.. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఈ అవార్డుల కోసం విన్న‌వించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం నంది అవార్డులు ఇచ్చి సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించాలి. సినిమా అనేది శ‌క్తిమంత‌మైన మాధ్య‌మం. తెలంగాణ సంస్కృతిని, ప్ర‌తిబింబించే, కొత్త‌గా చూపించే చిత్రాల‌కు క‌చ్చితంగా అవార్డులు ఇచ్చి ప్రోత్స‌హించాలి. దీని వ‌ల్ల రాష్ట్ర సంస్కృతిని మ‌రింతగా చూపించే సినిమాలు వ‌స్తాయి. దీని వ‌ల్ల ప‌ర్యాట‌కంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే తెలంగాణ‌లో 90 శాతం చిత్రీక‌ర‌ణ జ‌రిపే సినిమాల‌కు రాయితీలు ఇచ్చి ప్రోత్స‌హించాలి.

దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా త‌ర్వాత స్విట్జ‌ర్లాండ్‌కు ప‌ర్యాట‌కులు పెరిగారు. అలాగే తెలంగాణ‌ సినిమాల‌ను ప్రోత్స‌హిస్తే టూరిజం అభివృద్ధి చెందుతుంది అని ఫిలిం ఛాంబ‌ర్లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో విజ‌యేంద్ర అన్నారు.