అంజి రేంజులో మెగా ఫాంటసీ మూవీ

గత ఏడాది కళ్యాణ్ రామ్ కు బింబిసార రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు వశిష్ట మల్లిడి కొత్త సినిమా ఏదో ఇప్పటిదాకా సస్పెన్స్ గానే ఉంటూ వచ్చింది. దానికి సీక్వెల్ చేస్తారనే వార్తలు బలంగా వచ్చాయి. హీరో సైతం పలు సందర్భాల్లో ఆ ప్లాన్ ఉందని నొక్కి చెప్పాడు. అయితే కొనసాగింపుకు సంబంధించి ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రస్తుతానికది పెండింగ్ లో పెట్టారని టాక్. బింబిసారని ప్రత్యేకంగా చూసిన బాలకృష్ణ త్వరలోనే అవకాశమిస్తానని వశిష్టతో చెప్పడం అభిమానులకు గుర్తే. అయితే బాలయ్య కమిట్ మెంట్ల వల్ల అంత త్వరగా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఊహించని రీతిలో ఇప్పుడీ యువ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసి ఛాన్స్ కొట్టేశాడని లేటెస్ట్ లీక్. ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు గతంలో ఓకే చేసిన వెంకీ కుడుముల ప్రాజెక్టుని డ్రాప్ అయ్యారు. దీంతో అతను నితిన్ రష్మిక మందన్నలతో సెట్ చేసుకున్నాడు. వివి వినాయక్ పేరు వినిపిస్తున్నప్పటికీ స్టోరీ సెట్ కాకపోవడంతో అదీ పెండింగ్ లోనే ఉందట. ఇప్పుడు వశిష్ట చెప్పిన లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. అధికారికంగా ప్రకటించలేదు కానీ అంతర్గతంగా ఓకే అయినట్టు విశ్వసనీయ వార్త.

అభిమానులు కోరుకుంటున్నది ఇలాంటి కాంబినేషన్లే. మెహర్ రమేష్, మోహన్ రాజా లాంటి నిన్నటి తరం దర్శకుల కన్నా రజనీకాంత్ టైపులో న్యూ జనరేషన్ డైరెక్టర్లతో కట్టు కట్టాలని. బాలకృష్ణ అందుకే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిలతో లైనప్ చేసుకున్నారు. ఇక చిరు వశిష్టల కాంబోలో రూపొందబోయే చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇది కూడా బింబిసార తరహాలో ఫాంటసీ టచ్ తో ఉంటుందట. ఎలాగూ చిరంజీవి అంటే బడ్జెట్ పరంగా ఎలాంటి పరిమితులు ఉండవు కాబట్టి అంజి తరువాత ఆ రేంజ్ గ్రాండియార్ చూడొచ్చేమో.