విషాదంలో సురేశ్ బాబు, హీరో వెంకటేశ్

దగ్గుబాటి రామానాయుడి తమ్ముడు… నిర్మాత సురేశ్ బాబు, హీరో వెంకటేశ్‌ల బాబాయి దగ్గుబాటి రామ్మోహనరావు అలియాస్ మోహన్ బాబు మరణించారు. అనారోగ్య కారణాలతో ఆయన సొంతూరు కారంచేడులో తుది శ్వాస విడిచారు. దగ్గుబాటి రామానాయుడు హైదరాబాద్ సహా చెన్నైలో వ్యాపారాల నిర్వహిస్తున్న సమయంలో దగ్గుబాటి కుటుంబానికి చెందిన వ్యాపారాలను, వ్యవసాయాన్ని దగ్గుబాటి మోహన్ బాబు తన సొంత ఊరు కారంచేడులో ఉండి చూసుకునేవారు.

దగ్గుబాటి మోహన్ బాబు మృతి విషయం తెలుసుకుని హుటాహుటిన దగ్గుబాటి సురేష్ బాబు.. సినీ నటుడు, నిర్మాత దగ్గుబాటికి మేనల్లుడు అయిన అశోక్ బాబు, హీరో అభిరామ్ కారంచేడు వెళ్లారు. రేపు ఉదయం కారంచేడుకు సినీ హీరో వెంకటేష్, రానా కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్, రానాలు వెల్లిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారని ఇప్పటివరకు ఉన్న సమాచారం.

కాగా దగ్గుబాటి మోహన్ బాబుకు కూడా సినీరంగంలో అనుభవం ఉంది. ఒక చల్లని రాత్రి పేరుతో ఒక సినిమాను ఆయన నిర్మించారు. మరో రెండు చిత్రాలు కూడా ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో విడుదలయ్యాయి. చీరాలలో ఆయనకు ఒక థియేటర్ ఉంది. తన సోదరుడు రామానాయుడు కుమారులు, ఆ తరువాత తరం అయిన రానాతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి.

కాగా పెద్దగా వార్తల్లో, మీడియాలో దగ్గుబాటి మోహన్ బాబు పేరు కనిపించదు.. అయితే, ఇంతకుముందు 2019లో ఒకసారి ఆయన పేరు వినిపించింది. ఆ ఏడాది ఆయన ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. భారీగా బంగారం, నగలు పోయినట్లు అప్పట్లో మీడియాలో వార్తలొచ్చాయి.