‘సలార్’ సస్పెన్సుకి తెరదించేశారు

బాహుబలి దగ్గర్నుంచి ఒకే కథను రెండు భాగాలుగా తీసే ట్రెండు ఊపందుకుంది. కేజీఎఫ్, పుష్ప.. ఇలా ఈ వరుసలో చాలా సినిమాలే తయారయ్యాయి. ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ను కూడా రెండు భాగాలుగా తీస్తారని కొన్ని నెలల నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ మేకర్స్ ఈ విషయంలో ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వలేదు. కానీ ప్రశాంత్ నీల్ శైలి తెలిసిందే కాబట్టి కచ్చితంగా ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందనే అభిమానులు బలంగా నమ్ముతూ వచ్చారు. ఇప్పుడు ఆ విషయమే ఖరారైంది.

‘సలార్’ 2 పార్ట్స్‌గా రాబోతున్న విషయాన్ని హోంబలె ఫిలిమ్స్ వాళ్లు అధికారికంగా ప్రకటించారు. ముందు అనుకున్న ప్రకారమే సెప్టెంబరు 28న ఫస్ట్ పార్ట్ విడుదల కాబోతోంది. ‘కేజీఎఫ్’ తరహాలోనే ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైంకే సెకండ్ పార్ట్‌లోనూ కొంత చిత్రీకరణ పూర్తి చేయనున్నాడు ప్రశాంత్. ప్రభాస్ వేరే కమిట్మెంట్లను బట్టి రెండో భాగం రిలీజ్ సంగతి తేలుతుంది.

లోకేష్ కనకరాజ్ తరహాలోనే ప్రశాంత్ సైతం తన సినిమాలకు ఒకదాంతో ఒకదానికి కనెక్షన్ ఏర్పరిచి మల్టీవర్స్ ఫీల్ తీసుకురాబోతున్నాడు. ‘కేజీఎఫ్’తోనూ ‘సలార్’కు కనెక్షన్ ఉండబోతోంది. రాకీ భాయ్ క్యారెక్టర్ కూడా ‘సలార్’లో ఉంటుందని ఇప్పటికే సంకేతాలు అందాయి. రాకీని మించిన డాన్‌గా ప్రభాస్ ఇందులో దర్శనం ఇవ్వబోతున్నాడు. ‘కేజీఎఫ్’ చూసినపుడే ఇలాంటి హీరో పాత్రలో ప్రభాస్ కనిపిస్తే.. ఎలివేషన్ ఇంకో లెవెల్‌లో ఉంటుంది కదా అనే ఫీలింగ్ కలిగింది జనాలకు. ప్రశాంత్‌తో ప్రభాస్ జట్టు కడితే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అనుకున్నారు. ఆ కలయిక నిజం కావడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఇందులో ప్రభాస్ మాన్‌స్టర్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.

మోస్ట్ వయొలెంట్ అనుకునే వాళ్లు అతణ్ని మోస్ట్ వయొలెంట్ అంటారు.. అంటూ ప్రభాస్ పాత్రకు ఇంతకుముందు ఒక వీడియోలో ఇచ్చిన ఎలివేషన్ సినిమా మీద భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.