గొడవ మొదలైంది.. కంగనా వచ్చేసింది

బాలీవుడ్లో కంగనా రనౌత్‌ను పెద్ద న్యూసెన్స్ కేస్‌గా అభివర్ణిస్తుంటారు అక్కడి జనాలు. కంగనా టాలెంట్, ఆమె సినిమాల ఛాయిస్ చూసి అభినందించకుండా ఉండలేం కానీ.. ఆమె అయిన దానికి కాని దానికి గొడవ చేసే తీరు.. బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలు చేసే వైనం చూస్తే ఎవరికైనా చికాకు పుడుతుంది. ఇప్పటిదాకా ఆమెతో ముడిపడ్డ వివాదాల గురించి చెప్పడానికి చాలా ఉంది.

ఐతే ఎవరి హవా అయినా ఎక్కువ కాలం నడవదని.. ఎత్తుగడలు కొన్నిసార్లు తిరగబడతాయని కంగనాను చూస్తే అర్థమవుతుంది. బాలీవుడ్లో వేరే వాళ్ల సినిమాలు పోతుంటే మహదానంద పడుతూ కౌంటర్లు వేసిన కంగనా.. తన సినిమాలకూ ఘోర పరాభవాలు ఎదురవడంతో కొంచెం వెనక్కి తగ్గింది. కానీ ఈ మధ్య మళ్లీ ఆమెలో పాత మనిషి బయటికి వస్తోంది.

బాలీవుడ్లో ఎవరు ఎవరి మీద విమర్శలు, ఆరోపణలు చేసినా.. తగుదునమ్మా అంటూ రంగలోకి దిగిపోయి అక్కడ టార్గెట్ అవుతున్న వ్యక్తుల మీదికి కంగనా బాణాలు విసిరేస్తుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా ఆరోపణల మీద కూడా ఇలాగే స్పందించింది. బాలీవుడ్లో తనకు వ్యతిరేకంగా ఒక గ్యాంగ్ తయారైందని, వారి రాజకీయాలు తట్టుకోలేకే తాను బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని హాలీవుడ్‌కు వెళ్లిపోయానని తాజాగా ప్రియాంక వ్యాఖ్యానించింది.

ప్రియాంక చిన్న కామెంట్ చేస్తే దాని మీద వరుస బెట్టి ట్వీట్లు వేయడం మొదలుపెట్టింది కంగనా. ప్రియాంక ఎవరి పేర్లూ చెప్పకపోయినప్పటికీ.. ఆమెను తొక్కేయాలని చూసింది కరణ్ జోహారే అంటూ ఆయన్ని టార్గెట్ చేసింది కంగనా. ప్రియాంక షారుఖ్‌కు క్లోజ్ అవడం చూసి కరణ్ తట్టుకోలేకపోయాడని.. అందుకే ఆమెను బ్యాన్ చేశాడని.. తనతో పాటు తనకు తెలిసిన వాళ్లెవ్వరి సినిమాల్లోనూ ఆమె నటించకుండా చేశాడని కంగనా ఆరోపించింది. ఇంకా కరణ్ మీద పలు ఆరోపణలు చేసింది కంగనా. ఐతే ఇలాంటి వివాదాల్లో నీ జోక్యం ఏంటి.. కరణ్ లాంటి వాళ్లను ఇంకా ఎంత కాలం టార్గెట్ చేస్తావ్ అంటూ నెటిజన్లు ఆమెకు కౌంటర్లు వేస్తున్నారు.