మల్లారెడ్డిని బ్రతిమాలిన హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించేందుకు తనకు ఆఫర్ వచ్చిందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పబ్లిక్ స్టేజి మీద చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇది తేరి రీమేక్. మెయిన్ స్టోరీని అలాగే ఉంచేసి గబ్బర్ సింగ్ తరహాలో ఒరిజినల్ కన్నా ఇదే బెటరనిపించేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ప్రస్తుతం క్యాస్టింగ్ చేసే పనుల్లో బిజీగా ఉన్న హరీష్ ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం మల్లారెడ్డిని గంటన్నర బ్రతిమాలుకున్నారట. కానీ నో అనేశారు.

తేరిలో ఈ క్యారెక్టర్ ప్రముఖ దర్శకులు నటులు మహేంద్రన్ పోషించారు. పరమ దుర్మార్గుడిగా వయసు మళ్ళిన వ్యక్తిగా గొప్పగా పండించారు. ఆయన పెర్ఫార్మన్స్ కు అవార్డులు కూడా వచ్చాయి. సమంతాని ఫ్లాష్ బ్యాక్ లో దారుణంగా చంపించేది ఈయనే. పోలికల పరంగా చూసుకుంటే మల్లారెడ్డి మంచి ఛాయసే కానీ అసలు నటనే రాని మనిషితో అంత పవర్ ఫుల్ రోల్ చేయించాలని హరీష్ ఎలా అనుకున్నారో ఏమో. ఛాయ్ బిస్కెట్ టీమ్ నిర్మించిన మేం ఫేమస్ టీజర్ లాంచ్ సందర్భంగా ఇచ్చిన ప్రసంగం మల్లారెడ్డి ఈ హాట్ న్యూస్ చెప్పేశారు.

సో ఈ లెక్కన ఉస్తాద్ భగత్ సింగ్ లో మెయిన్ విలన్ ఇంకా లాక్ అయినట్టు లేదు. నిన్నటితో వినోదయ సితం రీమేక్ పూర్తి చేసిన పవన్ నెక్స్ట్ హరిహరవీరమల్లుని ఫినిష్ చేసి ఆ తర్వాత ఉస్తాద్, సుజీత్ తో చేస్తున్న ఓజి రెండింటికి సమాన డేట్లు ఇవ్వబోతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం గద్దలకొండ గణేష్ తర్వాత ఏళ్ళ తరబడి ఎదురు చూసిన హరీష్ శంకర్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని గబ్బర్ సింగ్ కు మించి అని ఋజువు చేసేలా అన్నిరకాలుగా సిద్ధమవుతున్నారు. వాల్తేరు వీరయ్యతో ఛార్ట్ బస్టర్ ఆల్బమ్ ఖాతాలో వేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు