నాగబాబుకి భలే కలిసి వచ్చింది

హఠాత్తుగా మగధీరని పక్కనపెట్టేసి రామ్ చరణ్ పుట్టినరోజుకి ఆరంజ్ రీ రిలీజ్ ని ప్లాన్ చేయడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2010లో విడుదలైనప్పుడు అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిపోయిన ఈ లవ్ స్టోరీని ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ మూవీ తర్వాత ప్లాన్ చేయడమేంటని మూవీ లవర్స్ వాపోయారు. అయితే ఫ్యాన్స్ మాత్రం చూసే తీరతామని సోషల్ మీడియా వేదికగా చెప్పేశారు. కల్ట్ క్లాసికని పాటలు చరణ్ డాన్సుల కోసం ఖచ్చితంగా టికెట్లు కొంటామని ప్రకటించారు. జనసేనకు నిధుల సమీకరణ షోలను ముందే చెప్పారు కాబట్టి పవన్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ దక్కింది

కట్ చేస్తే నిన్నటి నుంచి ఆరంజ్ కు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ బోర్డులు పడ్డాయి. ఒక్క హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోనే దేవి, సంధ్య, సుదర్శన్ లాంటి సింగల్ స్క్రీన్లన్నీ కలిపి 17 లక్షలకు పైగా వసూలు కావడం ఆశ్చర్యపరిచింది. డిమాండ్ ని తట్టుకోలేక మళ్ళీ ఆసియన్ తారకరామాను జోడించారు. అది కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ దిశగా వెళ్తోంది. మాస్ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉండే సీడెడ్ కర్నూలు కడప లాంటి ప్రాంతాల్లో సైతం ఈ రెస్పాన్సే కనిపిస్తోంది. ట్విట్టర్ మొత్తం థియేటర్లో పాటలు వచ్చినప్పుడు ఆడియన్స్ ఊగిపోతూ డాన్సులు చేస్తున్న వీడియోలే కనిపిస్తున్నాయి.

అప్పట్లో ఆరంజ్ కు వచ్చిన నష్టాల వల్ల తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లానని తమ్ముడు పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవి అండగా ఉండకపోతే చనిపోయేవాడినని చెప్పిన నాగబాబుకి ఇప్పుడదే మెగా ఫ్లాప్ కల్పతరువుగా నిలిచింది. పర్సెంటేజ్ షేరింగ్ లో వచ్చిన భేదాల కారణంగా మల్టీప్లెక్సులు ఆరంజ్ స్క్రీన్ చేసేందుకు ఇష్టపడలేదు. దాంతో అధిక శాతం సింగల్ థియేటర్లకే పరిమితం కావాల్సి వచ్చింది. లేదంటే పోకిరి, జల్సాలను ఈజీగా దాటేదని ట్రేడ్ అభిప్రాయం. ఏదైతేనేం చావు ఆలోచన తెప్పించిన సినిమానే ఇప్పుడు కామధేనువుగా మారడం విశేషం విచిత్రం