తప్పు దిద్దుకున్న రష్మిక

నిన్ననే ‘భీష్మ’ తర్వాత నితిన్, రష్మిక మందన్నా, వెంకీ కుడుముల కాంబినేషన్లో కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ వీడియో వదిలింది చిత్ర బృందం. అందులో నితిన్, రష్మిక వాళ్ల మీద వాళ్లే కొన్ని కౌంటర్లు వేసుకోవడం భలే సరదాగా అనిపించింది. రష్మిక తాను ఒక్క మాట మాట్లాడితే రెండు మూడు కాంట్రవర్శీలు అవుతున్నాయంటూ ఒక కామెంట్ చేయడం విశేషం. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు.

ఆమె ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చిందంటే అందులో తను మాట్లాడిన ఏదో ఒక పాయింట్ మీద వివాదం చెలరేగడం కామనే. గత ఏడాది ఇలాగే ఒక ఇంటర్వ్యూ తీవ్ర వివాదాస్పదం అయింది. తన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’లో అవకాశం రావడం గురించి చెబుతూ.. ఆ నిర్మాణ సంస్థ పేరెత్తడానికి.. అలాగే దర్శక నిర్మాతలు రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిల గురించి మాట్టాడ్డానికి రష్మిక ఇష్టపడలేదు. అంతే కాక రిషబ్ కొత్త చిత్రం ‘కాంతార’ చూడలేదని అనడం మీదా వివాదం రాజేశారు.

తర్వాత ఓ ఇంటర్వ్యూలో తానేం ఏం చేసినా తప్పంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రష్మిక. అప్పుడు అలా కవర్ చేసినప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఆ తప్పును దిద్దుకుంది రష్మిక. తాజాగా ఇంకో ఇంటర్వ్యూలో తన తొలి సినిమా గురించి మాట్లాడుతూ.. రక్షిత్ శెట్టితో పాటు అతడి నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ పేరు కూడా చెప్పింది. “నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అలా అసలు ఊహించుకోలేదు కూడా. కానీ సినిమా అంటే చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. కొన్ని సినిమాల ఆడిషన్స్‌కు కూడా వెళ్లా. కానీ నిరాశ తప్పలేదు. నటన అనేది నాకు రాసి పెట్టి లేదని అనుకునేదాన్ని. అలాంటి టైంలో నేనొక అందాల పోటీలో పాల్గొని టైటిల్ గెలిచా. దానికి సంబంధించిన ఫొటోల్ని పేపర్లో చూసి రక్షిత్ శెట్టి సంస్థ పరంవా స్టూడియోస్ నుంచి కాల్ వచ్చింది. తాము తీస్తున్న ‘కిరిక్ పార్టీ’లో దర్శక నిర్మాతలు నాకు రోల్ ఆఫర్ చేశారు. అలా నటిగా నా తొలి అడుగు పడింది” అని రష్మిక వివరించింది.