ఎన్టీఆర్ 30 – సందేహాలన్నీ తీర్చేశారు

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవం ఈ రోజు అతిరథ మహారథుల మధ్య అట్టహాసంగా మొదలయ్యింది. మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేయగా పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. హీరోయిన్ జాన్వీ కపూర్ ముంబై నుంచి, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ఆకర్షణగా నిలిచారు. ఈ టీమ్ లో పని చేస్తున్న ప్రతిఒక్కరితో పాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి క్యాస్టింగ్ వేడుకకొచ్చారు

ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ ఎన్నో నెలల తర్వాత మీడియా సుముఖంగా మాట్లాడారు. బయట ప్రపంచానికి తెలియని ఒక కోస్టల్ ప్రాంతంలో ఈ కథ జరుగుతుందని దేవుడికి సైతం భయపడని ఎన్నో మృగాల మధ్య బ్రతుకుతున్న జనాల కోసం ఒకడొస్తాడని ఆ థీమ్ మీద ఈ కథ ఉంటుందని క్లూ ఇచ్చారు. కెరీర్ బెస్ట్ ఇస్తానని అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకుండా ఉండేలా తీస్తానని హామీ ఇచ్చేశారు. ఇదే స్టేజి మీద ఇతర సాంకేతిక నిపుణులు కూడా మాట్లాడారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు ఇందులో చూస్తారని వాళ్ళ మాటల్లో స్పష్టమైంది

మొత్తానికి ఏదైతేనేం ఎన్టీఆర్ 30 మొదలైపోయింది. ఒక నెల రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు యూనిట్ టాక్. శంషాబాద్ పరిసరాల్లో షూట్ చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకొవడంతో తారక్ ఫ్యాన్స్ చాలా వెలితిగా ఫీలవుతున్నారు. రిలీజ్ కోసం ఇంకో ఏడాది వెయిట్ చేయాలి కాబట్టి కొరటాల నుంచి జనతా గ్యారేజ్ కి పది రెట్లు ఎక్కువనిపించే అవుట్ ఫుట్ ని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకుండా ఇంత ఆలస్యం చేస్తూ వచ్చారు. ఈ ప్యాన్ ఇండియా మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉండబోతోంది