వాయిదాల సినిమాకు కొత్త రిలీజ్ డేట్


తమిళ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. ‘కాక్క కాక్క’ మొదలుకుని గత ఏడాది రిలీజైన ‘ముత్తు’ వరకు అతను చాలా క్లాసిక్సే అందించాడు. యాక్షన్ థ్రిల్లర్లను ఎంత పకడ్డందీగా తీస్తాడో.. ప్రేమకథా చిత్రాలను అంత హృద్యంగా తీర్చిదిద్దుతాడు గౌతమ్. 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నప్పటికీ.. గౌతమ్ ఎంత ట్రెండీగా ఉన్నాడో ‘ముత్తు’ సినిమా చూస్తే అర్థమవుతుంది.

ఐతే ఈ ఏస్ డైరెక్టర్ దర్శకుడిగా ఒక స్థాయి అందుకున్నాక అవసరం లేని సాహసాలు చేశాడు. నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నాడు. ఈ క్రమంలో ఫైనాన్షియర్లతో గొడవలు తలెత్తి అతడి సినిమాలు వరుసగా అర్ధంతరంగా ఆగిపోవడం మొదలైంది. ధనుష్ హీరోగా తీసిన ‘తూటా’ సినిమా కొన్నేళ్ల పాటు మరుగున పడి మూడేళ్ల కిందట అతి కష్టం మీద విడుదలైంది. ‘నరకాసురన్’ అనే గౌతమ్ ప్రొడ్యూస్ చేసిన సినిమా అసలు విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది.

దీంతో పాటు విక్రమ్ హీరోగా గౌతమ్ చాలా ఏళ్ల కిందట మొదలుపెట్టిన ‘ధృవనక్షత్రం’ కూడా పక్కన పడి ఉంది. షూటింగ్ చివరి దశలో ఈ సినిమా ఆగిపోయింది. విక్రమ్ సహా అందులో నటిస్తున్న ఆర్టిస్టులు దీనిపై ఆశలు వదులుకుని వేరే ప్రాజెక్టుల్లోకి వెళ్లిపోయారు. ఐతే ఎట్టకేలకు ఈ సినిమాను బయటికి తీసే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవలే విక్రమ్, ఇతర ఆర్టిస్టులను రప్పించి బ్యాలెన్స్ పార్ట్ అంతా షూట్ చేసేశాడు. ‘ధృవ నక్షత్రం’ ఒక కీలక పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు బెనెడిక్ట్ గారెట్.. ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమా షూట్ మొత్తం పూర్తయిందన్నాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మే 19కి రిలీజ్ అనుకుంటున్నట్లు సమాచారం.

ఏ అడ్డంకులూ లేకపోతే ఆ రోజు సినిమా థియేటర్లోకి దిగొచ్చు. కాక్క కాక్క, ఎన్నై అరిందాల్ తరహా ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో తెలుగమ్మాయి రీతు వర్మ కథానాయికగా నటించగా.. సిమ్రాన్ ఓ కీలక పాత్ర చేసింది.