పెళ్లిసందడి పాటల నుంచి ఆస్కార్ వేదిక దాకా

అనితరసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ల గురించి ఇప్పుడు వరల్డ్ వైడ్ మీడియాలో ఆసక్తి కలుగుతోంది. ఒక ప్రాంతీయ భాషలో ట్యూన్ చేసుకుని పాట రాయించి అది కూడా అచ్చ తెలుగు మాస్ పదాలతో నింపేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదింపజేసుకోవడమంటే చిన్న విషయం కాదు. ఈ ఇద్దరి స్నేహం కూడా ఈనాటిది కాదు. చంద్రబోస్ 1995లో రామానాయుడుగారు నిర్మించిన తాజ్ మహల్ తో తన కలం ప్రయాణం మొదలుపెట్టారు. ఆ సినిమా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ స్వయానా కీరవాణికి సోదరి అనే విషయం కాకతాళీయం.

మొదటి ఆల్బమే సూపర్ హిట్ దక్కడంతో బోస్ కు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. కేవలం ఏడాది గ్యాప్ తో పెళ్లి సందడి లాంటి ఆల్ టైం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ లో కీరవాణితో చేతులు కలపడం మొదలయ్యాక ఎన్నో అద్భుతమైన పాటలు ఈ కలయికలో వచ్చాయి. బొంబాయి ప్రియుడు యావరేజ్ గా ఆడినా ఆడియో అప్పట్లో క్రేజీగా అమ్ముడుపోయింది. స్టూడెంట్ నెంబర్ వన్ లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చదివాము సాంగ్ ఇప్పటికీ కాలేజీ ఫేర్ వెల్ పార్టీలలో క్రమం తప్పకుండా పాడుకునే గీతం. జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద బ్రేకిచ్చిన చిత్రమిది.

ఒకటో నెంబర్ కుర్రాడు, ఈ అబ్బాయి చాలా మంచోడు, గంగోత్రి ఇలా ఎన్నో ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఈ కలయికలో వచ్చాయి . ఆలా ఈ ప్రయాణం అలా నిరంతరం కొనసాగుతూ ఆర్ఆర్ఆర్ దాకా వచ్చింది. ఆస్కార్ గడప తొక్కింది. సంగీత దర్శకుడు గీత రచయితకు మధ్య పాతికేళ్లకు పైగా అనుబంధం ఉండటం చాలా అరుదు. కాలం మారే కొద్దీ మ్యూజిక్ డైరెక్టర్లు కొత్త లిరిసిస్టుల వైపు మొగ్గు చూపిస్తారు. కానీ కీరవాణి మాత్రం చంద్రబోస్ సాహిత్యాన్నే నమ్ముతూ వచ్చారు. రెగ్యులర్ గా పాటలు రాయిస్తూనే ఉన్నారు. అందుకేనేమో చరిత్ర సైతం సహకరించి ఆస్కార్ అనే గొప్ప ఘట్టంలో భాగస్వాములను చేసింది.