లూసిఫర్ రీమేక్.. ఆ కాస్త కూడా పోయింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ను రీమేక్ రీమేక్ చేస్తున్నారన్న సమాచారం బయటికి వచ్చినపుడు పెదవి విరిచిన వాళ్లే ఎక్కువమంది. ఎందుకంటే భాషల మధ్య అంతరాలు చెరిగిపోయిన డిజిటల్ యుగంలో అందరూ అన్ని భాషల సినిమాలూ చూసేస్తున్నారు.

పైగా ‘లూసిఫర్’ తెలుగులోకి కూడా అనువాదం అయింది. థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత అమేజాన్‌లోకి కూడా వచ్చింది. ఇక ఈ సినిమా ఏమైనా కొత్తగా ఉంటుందా అంటే అదీ లేదు. రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఇలాంటివి తెలుగులో కూడా చాలానే వచ్చాయి. అయినా సరే.. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి, రామ్ చరణ్ రెడీ అయిపోయారు. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించే అవకాశాలున్నట్లు చిరంజీవి కొన్ని నెలల కిందట స్వయంగా వెల్లడించాడు. అందరూ అతడికే ఫిక్సయిపోయారు.

కానీ ఇప్పుడు సుజీత్‌ను తప్పించిన వినాయక్‌ను ఓకే చేసినట్లు చెబుతున్నారు. మెగా కాంపౌండ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సుజీత్ ‘సాహో’తో చేదు అనుభవాన్ని ఎదుర్కొని ఉండొచ్చు కానీ.. అతను కొత్త ఆలోచనలున్న దర్శకుడు. స్టైలిష్ ఫిలిం మేకర్. రీమేక్ అయినా సరే.. దానికి తనదైన టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు.. ఏదో కొత్తదనం, ఒరిజినల్‌తో పోలిస్తే మార్పు చూపిస్తాడని ఆశించారు.

కానీ అతణ్ని తప్పించి.. పూర్తిగా ఔట్ డేట్ అయిపోయిన వినాయక్‌ను తీసుకొచ్చారు. ఒకప్పుడు ‘ఠాగూర్’ రీమేక్‌తో వినాయక్ సత్తా చాటాడు. కానీ ‘ఖైదీ నంబర్ 150’కి వచ్చేసరికి సాధారణంగా మారిపోయాడు. చిరు రీఎంట్రీ మూవీ, ఒరిజినల్లో దమ్ముండటంతో ఆ సినిమా ఆడేసింది కానీ.. అందులో వినాయక్ ఘనతేమీ లేదు.

అతడి చివరి సినిమా ‘ఇంటిలిజెంట్’ చూశాక చిరు మళ్లీ అవకాశం ఇస్తున్నాడంటే ఆశ్చర్యమే. వినాయక్ ఒక జిరాక్స్ కాపీ తీసి చేతిలో పెట్టడం మినహా చేసేదేమీ ఉండకపోవచ్చు. అందుకే ఈ రీమేక్ విషయంలో ఉన్న కాస్త ఆసక్తి కూడా పోయినట్లే.