అల్లు అర్జున్ ఓనిక్స్ స్క్రీన్ ప్రత్యేకత ఏంటంటే

హైదరాబాద్ అమీర్ పేట్ లో ఉన్న సత్యం థియేటర్ ని పడగొట్టి ఆ స్థానంలో ఏషియన్ గ్రూప్ అల్లు అర్జున్ భాగస్వామ్యంలో అతి పెద్ద మల్టీప్లెక్సు కడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నిర్మాణం పూర్తి కావొస్తోంది. చివరి దశ పనులు జరుగుతున్నాయి. ఉగాది పండగకు గ్రాండ్ ఓపెనింగ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఏవైనా అనూహ్య మార్పులు ఉంటే తప్ప నాని దసరాని ఇందులోనే చూడొచ్చు. మొత్తం 5 స్క్రీన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. పెద్ద ఐమాక్స్ స్క్రీన్ కూడా అనుకున్నారు కానీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాకపోవడంతో ఆ విషయంలో నిరాశ తప్పలేదు.

ఇందులో ప్రత్యేకంగా ఓనిక్స్ స్క్రీన్ ని అందుబాటులో తేనున్నారు. ఇది భాగ్యనగరంలోనే మొదటిది. దీని ప్రత్యేకత ఏంటంటే సాంప్రదాయ సినిమా ప్రదర్శనకు ఉపయోగించే ప్రొజెక్టర్ ఇందులో ఉండదు. పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ని ఏర్పాటు చేసి దాని వెనుకే షో రన్ చేయడానికి కావాల్సిన సాంకేతిక అమరుస్తారు. ఇది సామ్ సంగ్ సంస్థ ప్రత్యేకంగా తీసుకొచ్చిన టెక్నాలజీ. మనం రెగ్యులర్ తెరలపై చూసే స్పష్టతకు 3డి ఎఫెక్ట్స్ కు చాలా తేడా ఉంటుంది. విజువల్ గ్రాఫిక్స్ లో ఉన్న డీటెయిల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా చూస్తున్నంత సేపు అబ్బురపరుస్తాయి.

హాలీవుడ్ మూవీస్ ని ఇలాంటి ఓనిక్స్ మీద చూస్తున్నప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఇలాంటిది ఇదే మొదటిసారి కావడంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ మెంట్ ఓ రేంజ్ లో ఉంటుంది. గచ్చిబౌలిలో టాప్ మల్టీప్లెక్స్ గా వెలుగుతున్న ఏఎంబి సూపర్ ప్లెక్స్ ని తలదన్నేలా ఈ సముదాయంని డిజైన్ చేశారట. దూరం విషయంలో ఏఎంబి మాల్ సగటు జనానికి ఎక్కువ అందుబాటులో లేదు. కానీ నగరం నడిబొడ్డున ఉండే సత్యం కాంప్లెక్స్ లో ఇలాంటి సెటప్ అంటే ఏడాది పొడవునా కిక్కిరిసిపోవడం ఖాయం. ఒరిజినల్ ఐమ్యాక్స్ స్క్రీన్ కూడా వచ్చేస్తే ఆ కొరత కూడా ట్విన్ సిటీస్ పబ్లిక్ కి తీరిపోతుంది.