క్యారెక్టర్ ఆర్టిస్టుల సినిమాకు 50 కోట్ల వసూళ్లు

కొన్ని సినిమాల విజయాలు అనూహ్యంగా ఉంటాయి. తీసే సమయంలో దర్శక నిర్మాతలు ఆ స్థాయి ఫలితాలు ఊహించి ఉండరు. దానికి ఉదాహరణగా నిలుస్తోంది మలయాళంలో నెల రోజుల క్రితం విడుదలైన రొమంచమ్. ఇందులో మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి బడా స్టార్లు లేరు. ప్రధాన పాత్ర పోషించింది షౌబిన్ షాహిర్ అంటే నటుడు. బట్టతలతో పొట్టిగా ఉండే ఈ ఆర్టిస్టు సహజమైన నటనతో ఇట్టే ఆకట్టుకుంటాడు. ఆ మధ్య ఆలీ నిర్మించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఒరిజినల్ వెర్షన్ లో ఆ క్యారెక్టర్ చేసింది ఇతనే. కేరళలో చాలా మంచి పేరుంది.

కేవలం 2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన రొమంచమ్ ఇంకా ఫైనల్ రన్ కు వెళ్లకుండా 55 కోట్ల గ్రాస్ ని దాటేసి కొత్త రికార్డులు సృష్టించేందుకు పరుగులు పెడుతోంది. జితు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ కం హారర్ థ్రిల్లర్. 2007 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఏడుగురు బ్రహ్మచారులు బోర్ కొడుతోందనే ఉద్దేశంతో సరదాగా ఔజా గేమ్ ఆడతారు. అంటే ఓ బోర్డు మీద ఇంగ్లీష్ అక్షరాలు నెంబర్లు ఉపయోగించి ప్రేతాత్మలతో మాట్లాడ్డం. ఏదో టైం పాస్ కోసం మొదలుపెడితే ఇది కాస్తా అనూహ్య సంఘటనలకు దారి తీస్తుంది. అక్కడి నుంచి జరిగేది మాములుగా నవ్వించదు.

ఇప్పుడీ రొమంచమ్ రీమేక్ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. తెలుగు నుంచి రెండు బడా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇటీవలి కాలంలో మల్లువుడ్ కథలు మనకు అంతగా అచ్చిరావడం లేదు. అందుకే రేట్ రీజనబుల్ గా అనిపిస్తేనే కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయినా ఓటిటిల కాలంలో రూపాయి పెట్టుబడి ముప్పై రూపాయల లాభం ఏ వ్యాపారంలోనూ లేదు. అలాంటిది ఈ రొమంచమ్ రేపుతున్న సంచలనం చూస్తుంటే కంటెంట్ కున్న బలమేంటో అర్థం చేసుకోవచ్చు. క్రియేటివిటీ చూపించాలే కానీ ఆడియన్స్ ఆదరణ ఎప్పుడూ ఉంటుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.