అభిమాని కోసం టీజర్ ఆపేశారు

తమను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు ఫ్యాన్స్ కోసం హీరోలు ఎంత చేసినా తక్కువే. అయితే లక్షలు కోట్లలో ఉండే వీళ్లందరి బాగోగులు చూడటం ప్రత్యక్షంగా పలకరించడం సాధ్యమయ్యే పని కాదు కానీ ఉన్నంతలో సందర్భానికి తగ్గట్టు కర్టసి చూపించడం ఎంతైనా అవసరం. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అదే చేశాడు. ఇవాళ తన కొత్త సినిమా విరూపాక్ష టీజర్ రిలీజ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న వినోదయ సితం రీమేక్ షూటింగ్ జరుగుతున్న సెట్ లో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా చూపించి మరీ మావయ్య అభినందనలు అందుకున్నాడు తేజు.

అనూహ్యంగా ఇవాళ భీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రావూరి పండు హఠాన్మరణం చెందటంతో లాంచ్ ని వాయిదా వేశారు. ఈ పండు చాలా చిన్న వయసు కావడం, ఇటీవలి కాలంతో అందరినీ భయపెడుతున్న తరహాలోనే గుండెపోటుకి గురి కావడం తీవ్ర విషాదాన్ని రేపుతోంది. తేజు కోసం ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన పండు గతంలో తన హీరోతో కలుసుకున్న ఫోటోలు, చేసిన కార్యక్రమాలు అన్నీ సోషల్ మీడియాలో పెట్టేవాడు. ఇంత సన్నహితంగా ఉండేవాడు కాబట్టి ఈ సందర్భంలో టీజర్ ని రిలీజ్ చేయడం భావ్యం కాదని పోస్ట్ పోన్ చేయడం మంచిదే.

వచ్చే నెల విడుదల కాబోతున్న విరూపాక్ష మీద భారీ అంచనాలున్నాయి. సుకుమార్ రచన చేసిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మూఢనమ్మకాల మీద కథను అల్లుకున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 21 విడుదల ప్లాన్ చేసుకున్న విరూపాక్షకు గట్టి పోటీ స్వాగతం చెబుతోంది. అదే రోజు సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ విడుదల కానుంది. తేజు మూవీని కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషల్లో ప్లాన్ చేశారు కాబట్టి కండల వీరుడిని తట్టుకుని నిలవాల్సి ఉంటుంది. రిపబ్లిక్ తర్వాత తను చేస్తున్న చిత్రమిదే.