2023లో మైత్రి.. 2024లో శంక‌ర్?

ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రెండు సినిమాలు రిలీజ్ కావ‌డం.. అవి రెండూ ఇద్ద‌రు టాప్ స్టార్లు న‌టించిన‌ భారీ చిత్రాలు కావ‌డం.. పైగా అది సంక్రాంతి సీజ‌న్ కావ‌డం ఊహ‌కంద‌ని విష‌యం. 2023 సంక్రాంతికి ఇదే జ‌రిగింది.

మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీర‌య్య‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌తో వీర‌సింహారెడ్డి చిత్రాల‌ను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌.. రెంటినీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసింది. ఇదే అరుదైన విష‌యం అంటే.. ఆ రెండు చిత్రాలూ బాక్సాపీస్ ద‌గ్గ‌ర మంచి ప‌లితాలు అందుకుని మైత్రీ వారికి లాభాలు తెచ్చిపెట్ట‌డం మ‌రో విశేషం. కాగా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఇలాంటి అరుదైన విష‌య‌మే జ‌ర‌గ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈసారి ఒకే ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి రెండు సినిమాలు వ‌స్తే.. వ‌చ్చే ఏడాది ఒకే ద‌ర్శ‌కుడి నుంచి రెండు సినిమాలు రిలీజ‌వుతాయ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడు శంక‌ర్ అని అంటున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం ఒకేసారి రెండు సినిమాలు తీస్తున్నారు. ఒక‌టి రామ్ చ‌ర‌ణ్‌తో దిల్ రాజు నిర్మాణంలో చేస్తున్న సినిమా కాగా.. ఇంకోటి ఎప్ప‌ట్నుంచో పెండింగ్‌లో ఉండి ఈ మ‌ధ్యే తిరిగి సెట్స్ మీదికి వెళ్లిన ఇండియ‌న్-2. ఈ సంక్రాంతికే అనుకున్న చ‌ర‌ణ్ సినిమా.. మ‌ధ్య‌లో ఇండియ‌న్-2 తెర‌పైకి రావ‌డం, ఇత‌ర కార‌ణాల‌ వ‌ల్ల వాయిదా ప‌డింది. ఆ చిత్రాన్ని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

మ‌రోవైపు ఇండియ‌న్-2 ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా సంస్థ అధినేత‌లు కూడా 2024 సంక్రాంతి మీదే క‌న్నేశారు. ఈ సినిమా పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, ప్ర‌మోష‌న్ అంతా అయ్యేస‌రికి ఈ ఏడాది గ‌డిచిపోతుంది. వ‌చ్చే సంక్రాంతే రిలీజ్‌కు స‌రైన‌టైమింగ్ అనుకుంటున్నారు. దర్శ‌కుడు ఒక‌డే అయిన‌ప్ప‌టికీ.. హీరోలు, నిర్మాత‌లు వేరు కాబ‌ట్టి ఎవ‌రిష్టం ఇక్క‌డ శంక‌ర్‌కు వ‌చ్చిన ఇబ్బంది లేదు. మ‌రి నిజంగానే ఈ సినిమాలు రెండూ ఒకేసారి రిలీజ‌వుతాయేమో చూడాలి.