జాన్వీకపూర్ ఎంట్రీ వెనుక తండ్రి ప్లానింగ్

అతిలోకసుందరి దివంగత శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం గతంలో ఎన్నో ప్రతిపాదనలు జరిగాయి. తండ్రి బోనీ కపూర్ చాలా ఆఫర్లను దాటవేస్తూ హిందీకే పరిమితం చేశారు తప్ప ఏనాడూ దక్షిణాది ప్రవేశం కోసం తొందరపడలేదు. విజయ్ దేవరకొండ లైగర్ లో నటింపజేసేందుకు కరణ్ జోహార్ రికమండేషన్ తో పూరి జగన్నాధ్ గట్టి ప్రయత్నమే చేశాడు కానీ వర్కౌట్ కాలేదనే టాక్ అప్పట్లోనే వచ్చింది. జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ రామ్ చరణ్ తో తీస్తే కనక అందులో జాన్వీనే ఎంపిక చేసుకుంటానని నిర్మాత అశ్వినిదత్ పలు సందర్భాల్లో చెప్పారు.

ఇప్పుడివన్నీ పక్కకెళ్లిపోయి ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ 30న సినిమాలో జాన్వీ కపూర్ అఫీషియల్ గా లాక్ అయ్యింది. ఈ లీక్ వారం పది రోజుల నుంచి చక్కర్లు కొడుతూనే ఉన్నప్పటికీ వేర్వేరు కొత్త పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ అవన్నీ ఉత్తిత్తివేనని తేలిపోయింది. ఫోటో షూట్ చేసి తారక్ జాన్వీ జోడి పర్ఫెక్ట్ గా కుదురుతోందని దర్శకుడు కొరటాల శివ సంతృప్తి చెందాకే అనౌన్స్ మెంట్ ఇచ్చారట. శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ తొలినాళ్లలోలో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి బడిపంతులులో అద్భుతంగా నటించి మెప్పించింది..

ఆ తర్వాత ఆయన సరసనే హీరోయిన్ గా వేటగాడు, సర్దార్ పాపారాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడాయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె కూతురు జంట కట్టడం విశేషం. మొత్తానికి బోనీ కపూర్ పెద్ద హీరో సరసనే తన కూతురి డెబ్యూ జరగాలన్న లక్ష్యాన్ని చేరుకున్నారు. అందులోనూ ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటించడం దాదాపు ఖరారే అంటున్నారు. ఫిబ్రవరి 24న అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా షూటింగ్ ప్రారంభించబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్.