ఫ్లాప్ డైరెక్టర్ చేతిలో మూడు ప్రాజెక్టులు

దేవా కట్టా.. ‘వెన్నెల’ లాంటి చిన్న సినిమాతో సూపర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ లాంటి క్లాసిక్ తీసి గొప్ప పేరు సంపాదించిన దర్శకుడు. ‘ప్రస్థానం’ కమర్షియల్‌గా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా.. దేవాకు ఒక స్థాయిని తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత దేవా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

కానీ ఆ అంచనాలను అతను అందుకోలేకపోయాడు. విపరీతమైన జాప్యం తర్వాత రిలీజైన ‘ఆటోనగర్ సూర్య’ డిజాస్టర్ కాగా.. రీమేక్ మూవీ ‘డైనమైట్’ మరింత దారుణమైన ఫలితాన్నందుకుంది. ఈ రెండు చిత్రాలు దేవా కెరీర్‌ను బాగా వెనక్కి లాగేశాయి.

చాలా ఏళ్ల పాటు లైమ్ లైట్లో లేకుండా పోయిన దేవా.. మధ్యలో ‘బాహుబలి’ వెబ్ సిరీస్ కోసం నెట్ ఫ్లిక్స్‌ వాళ్లతో కొన్నాళ్లు కలిసి పని చేసి.. ఆ ప్రాజెక్టు క్యాన్సిలవడంతో బయటికి వచ్చేశాడు. చివరికి సాయిధరమ్ తేజ్‌ను పెట్టి ‘రిపబ్లిక్’ మూవీ తీశాడు.

ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో రిలీజ్ ముంగిట బాగానే ఆసక్తి రేకెత్తించినప్పటికీ.. ‘రిపబ్లిక్’ బాక్సాఫీస్ దగ్గర మాత్రం నిలవలేకపోయింది. సందేశంతో ముడిపడ్డ సినిమాలో కమర్షియల్ హంగులు పెద్దగా లేకపోవడం, పైగా ట్రాజిక్ ఎండింగ్ ఇవ్వడం చేటు చేసింది. దీంతో దేవా ఖాతాలో మరో ఫ్లాప్ జమ అయింది.

దీంతో మళ్లీ దేవా కెరీర్లో గ్యాప్ తప్పలేదు. వరుసగా ఇన్ని ఫ్లాపులు ఇచ్చాక ఏ దర్శకుడికైనా ఇబ్బంది తప్పదు. కానీ దేవా మాత్రం తీరిక లేకుండా కొత్త ప్రాజెక్టుల కోసం పని చేస్తున్నాడు. తాను నాలుగు ప్రాజెక్టుల మీద పని చేస్తున్నట్లు అతనే స్వయంగా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా క్లారిటీ ఇవ్వడం విశేషం.

తన కొత్త సినిమాల గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని.. కానీ వాటి గురించి తనే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానని దేవా చెప్పాడు. జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న ‘ఇంద్రప్రస్థం’ ఆధారంగా తెరకెక్కకుతున్న ఒక షోతో పాటు.. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఒక భారీ కథ మీద వర్క్ చేస్తున్నట్లు దేవా తెలిపాడు. వీటితో పాటు మరో భారీ కథను కూడా వర్కవుట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. దేవా ఉన్న ఫాంలో మూడు ప్రాజెక్టులు చేతిలో పెట్టుకోవడం విశేషమే.