బాలయ్య-అక్కినేని గొడవ.. వైసీపీ రంగంలోకి దిగిందా?

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మొన్న ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ.. ‘అక్కినేని తొక్కినేని’.. ‘ఆ రంగారావు ఈ రంగారావు’ అంటూ ఆయన యథాలాపంగా చేసిన కామెంట్లు పెద్ద వివాదానికే దారితీశాయి. బాలయ్య ఉద్దేశం ఏదైనప్పటికీ.. అక్కినేని వారిని కించపరిచారంటూ సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ మద్దతుదారులు ఎంత బాలయ్యను వెనకేసుకొచ్చే ప్రయత్నం జరిగినా సరే.. వారి ప్రయత్నం ఫలించలేదు. బాలయ్య పట్ల సానుకూల భావం ఉన్న వాళ్లు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాలయ్య చేసింది కచ్చితంగా తప్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే ఈ వివాదాన్ని అనుకున్నదానికంటే చాలా పెద్దదిగా మార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయిప్పుడు.

బాలయ్య ఆ మాటలు అన్నాక ఒక రోజు వరకు వివాదం చిన్నదిగానే ఉంది. కానీ మంగళవారం ఒక్కసారిగా గొడవ చాలా పెద్దదిగా మారిపోయింది. సోమవారం రాత్రి నుంచే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్.. బాలయ్య మీద తీవ్ర వ్యాఖ్యానాలు చేయడం, మరోవైపు అక్కినేని వారిని రెచ్చగొట్టడం చేశాయి. దీంతో నెమ్మదిగా చిచ్చు రాజుకుంది. అదే సమయంలో బాలయ్య అంటే పడని మెగా అభిమానులు కూడా రంగంలోకి దిగారు.

ఇదిలా ఉంటే ఎస్వీ రంగారావును కించపరిచారంటూ కాపు కుల నాయకులు కొందరు బాలయ్యకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తూ, క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అల్టిమేటం విధించారు. నిజానికి ఎస్వీ రంగారావు కులం ఏంటో చాలామందికి తెలియదు. ఆయన్ని ఒక కులానికి పరిమితం చేసి ఎవ్వరూ చూడరు. ఆయన అలాంటి పరిమితులేమీ లేని విశ్వనటుడు. అలాంటి వ్యక్తికి కులం ఆపాదించి బాలయ్య మీద దాడికి దిగడంలో కుట్ర కోణం కనిపిస్తోందన్నది టీడీపీ వర్గాల మాట. అదను చూసి వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఐప్యాక్ టీం రంగంలోకి దిగి.. దీన్ని కమ్మ-కాపు కుల గొడవగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని అనుమానిస్తున్నారు. పరిణామాలు చూస్తుంటే ఈ సందేహాలు నిజమే అనిపిస్తోంది.