బాలయ్య ఎప్పుడు మారతాడు?

సినిమా హీరోలు వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్లయినా కావచ్చు. కానీ పబ్లిక్‌లోకి వచ్చినపుడు హుందాగా మాట్లాడక, ప్రవర్తించక తప్పదు. ఎందుకంటే వాళ్లను అభిమానించే, అనుసరించేవాళ్లు కోట్లల్లో ఉంటారు. జనాల మీద వారి వ్యాఖ్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాలి. ప్రవర్తన కూడా అదుపు తప్పకుండా చూసుకోవాలి. అందులోనూ ఒక సినిమా హీరో ప్రజా ప్రతినిధి కూడా అయితే మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ రెండో పర్యాయం ఎమ్మెల్యేగా పని చేస్తున్న సినీ హీరో నందమూరి బాలకృష్ణకు ఇవేవీ పట్టవు.

స్టేజ్ ఎక్కితే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. మాట మీద అస్సలు అదుపు ఉండదు. బయట పబ్లిక్‌లో తిరిగేటపుడు కూడా ఆయన నియంత్రణ కోల్పోతారు. తనను ఎవరైనా ఇబ్బంది పెడితే చేయి చేసుకుంటారు. ఏమన్నా అంటే నా అభిమానులను నేను కొట్టుకుంటా, ఏమైనా చేసుకుంటా.. నేను కొట్టినా కూడా వాళ్లకు ఆనందమే అంటాడు బాలయ్య. ఆయన్ని సమర్థిస్తూ మాట్లాడే పూరి జగన్నాథ్‌లు, సాయిమాధవ్ బుర్రాలకు కొదవే ఉండదు. ఏ రకంగా సమర్థించుకోజూసినా కూడా బాలయ్య ప్రవర్తన ఆక్షేపణీయమే.

ఇక బాలయ్య మాటల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. వేదిక ఎక్కితే చాలు తన గురించి, తన తండ్రి గురించి, తమ కుటుంబం గురించి అదే పనిగా గొప్పలు చెప్పుకోవడం బాలయ్యకు అలవాటు. దాని వరకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ వేరే వాళ్లను కించపరుస్తూ మాట్లాడే మాటలతోనే వస్తోంది తంటా. అలగా జనం.. మా బ్లడ్డు వేరు బ్రీడ్ వేరు.. లాంటి వ్యాఖ్యలతో ఆయన ఎంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారో తెలిసిందే. అలాగే ఒక వేడుకలో ‘‘కడుపు చేయాల్సిందే’’ అంటూ బాలయ్య చేసిన కామెంట్ కూడా తీవ్ర దుమారానికి దారి తీసి.. అసెంబ్లీలో ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా ‘‘అక్కినేని తొక్కినేని’’ అంటూ ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో బాలయ్య చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ఫ్లోలో అనేశారు, వేరే ఉద్దేశం ఏమీ లేదు.. అంటూ బాలయ్యను ఆయన ఫ్యాన్స్ ఎంత వెనకేసుకురావాలని చూసినా ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమే. అసలే రాబోయేది ఎన్నికల కాలం. ఇలాంటి అనవసర వివాదాలు బాలయ్యకు, పార్టీకి కూడా చేటు చేస్తాయి. కాబట్టి తన వ్యాఖ్యల విషయంలో హుందాగా క్షమాపణలు చెప్పడం, ఇకముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం బాలయ్యకే మంచిది.