మాస్‌ రాజాతో అతను.. సెట్టవుతుందా?

రవితేజకు మాస్ రాజా అనే పేరు ఊరికే రాలేదు. ఆయన కెరీర్లోని పెద్ద హిట్లన్నీ పక్కా మాస్ సినిమాలే. చివరగా రవితేజ కెరీర్‌కు మంచి ఊపు తెచ్చిన ‘ధమాకా’ సైతం పక్కా మాస్ సినిమానే. అలా అని రవితేజ ఎప్పుడూ మాస్ సినిమాలకే పరిమితం అయిపోలేదు.

అప్పుడప్పుడూ రొటీన్‌కు భిన్నమైన, కొంచెం కొత్తగా అనిపించే, క్లాస్ టచ్ ఉన్న సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ అవి ఆయనకు అస్సలు కలిసి రావడం లేదు. ‘ఆటోగ్రాఫ్’ మొదలుకుని.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ వరకు తన ఇమేజ్‌ పక్కన పెట్టి రవితేజ చేసిన సినిమాలు ఆయనకు చేదు అనుభవాలు మిగిల్చాయి.

ఇలా ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారీ ఎందుకొచ్చిన ప్రయోగాలు అన్నట్లుగా మళ్లీ మాస్ చొక్కా తొడుక్కుంటూ ఉంటాడు రవితేజ. కానీ కొన్నాళ్లకు మళ్లీ ఒక డిఫరెంట్ సినిమా చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటి ఆలోచనే చేస్తున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా మారిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో రవితేజ ఒక క్రేజీ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ‘అ!’ అనే డిఫరెంట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్.. ఆ తర్వాత ‘జార్జిరెడ్డి’, ‘హనుమాన్’ సినిమాలు తీశాడు. ‘జార్జిరెడ్డి’ ఉన్నంతలో బాగానే ఆడింది. ‘హనుమాన్’ మంచి హైప్ తెచ్చుకుంది. దీని తర్వాత నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడతను. కానీ బాలయ్య కమిట్మెంట్ల వల్ల అది ఇప్పుడే వర్కవుట్ అయ్యేలా లేదు. ఈ లోపు రవితేజకు ఒక కథ చెప్పి మెప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్ సినిమా అంటే కొంచెం డిఫరెంట్‌గా, క్రేజీగా ఉంటుంది. ఐతే రవితేజ ఇలా రూట్ మార్చి చేసిన సినిమాలన్నీ చేదు అనుభవాలే మిగిల్చిన నేపథ్యంలో ఆయన ఇమేజ్‌కు సరిపోయే సినిమాను ప్రశాంత్ అందించగలడా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో, అదెలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.