హిట్టు సినిమా దర్శకుడికి ఇదేం పరిస్థితో

వరిసు అలియాస్ వారసుడు కంటెంట్ మీద ఎన్ని కామెంట్లు ట్రోల్స్ వచ్చినా తమిళ వెర్షన్ సునాయాసంగా నూటా యాభై కోట్ల గ్రాస్ ని దాటేసే టార్గెట్ ని సులభంగా చేరుకుంది. తునివుతో పోటీ తట్టుకుని మరీ విన్నర్ గా నిలిచింది. మ్యాటర్ ఎంత రొటీన్ గా ఉన్నా కమర్షియల్ అంశాలు ఉంటే చాలు విజయ్ ఇమేజ్ కోట్ల కనక వర్షం కురిపిస్తుందని మరోసారి ఋజువయ్యింది. తెలుగు హిందీలో ఎంత ఆడినా దాన్ని దిల్ రాజు బోనస్ గానే భావించారు కాబట్టి పెట్టుబడి రాబడి లెక్కల్లో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతగా అంటే టీమ్ మొత్తానికి హైదరాబాద్ లో చాలా ఖరీదైన పార్టీ ఇచ్చేంత. దీనికి విజయ్ వస్తాడని టాక్ ఉంది.

సరే సక్సెస్ ఏ రూపంలో వచ్చినా ఫైనల్ గా దానివల్ల లాభపడేది హీరో తర్వాత దర్శకుడే. కానీ వంశీ పైడిపల్లి ఒకరకంగా విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నాడని చెప్పాలి. వారసుడు చూసిన టాలీవుడ్ స్టార్లకు అందులో కొత్తదనమేం కనిపించలేదు. ఖచ్చితంగా ఇతనితో ఒక మూవీ చేయాలనిపించే రేంజ్ లో హీరోయిజం పేలలేదు. పైగా పాత కథలను కలిపి కుట్టేశారన్న విమర్శ నిజమనిపించేలా టేకింగ్ ఉండటం అంతగా ఇంప్రెషన్ తేలేదు. సో ఇప్పటికిప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ మహేష్ బాబుతో సహా ఎవరూ అంత వేగంగా స్పందించకపోవచ్చు ఏదైనా ఎక్స్ ట్రాడినరి అనిపించే సబ్జెక్టు వినిపిస్తే తప్ప

మరోవైపు ఒరిజినల్ వెర్షన్ ఇంత గొప్ప విజయం సాధించినా వంశీకి కోలీవుడ్ స్టార్ల నుంచి ఇంకా పిలుపులు రాలేదని చెన్నై మీడియా టాక్. అందరూ బాక్సాఫీస్ పరిణామాలను గమనించే పనిలో ఉన్నారు. పైగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఫిలిం మేకింగ్ గురించి వంశీ పైడిపల్లి చేసిన నాట్ ఏ జోక్ బ్రదర్ సమాధానాలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు దారి తీశాయి. తనను తాను సమర్ధించుకునే క్రమంలో పైడిపల్లి అన్న మాటలు మిస్ ఫైర్ అయ్యాయి. ఇదంతా ఎలా ఉన్నా ఫైనల్ గా వంద కోట్లకు పైగా వసూలు చేసిన సినిమానైతే ఇచ్చాడు. మరి అడుగు ఇటో అటో ఇంకొంత కాలం ఆగితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు 

×