చేతులు కాలాక కమర్షియల్ సినిమా

వేణు ఉడుగుల అని ఒక అభిరుచి ఉన్న దర్శకుడు. తొలి సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’తో అతడి ప్రతిభేంటో ఇటు ఇండస్ట్రీ జనాలకు, అటు ప్రేక్షకులకు బాగానే అర్థమైంది. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడికి మంచి పేరొచ్చింది.

అతడి టాలెంట్ గుర్తించి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి లాంటి పేరున్న నిర్మాతలు రానా-సాయిపల్లవిల క్రేజీ కాంబినేషన్లో సినిమా తీసే అవకాశం ఇచ్చారు. కానీ దీన్ని వేణు ఉపయోగించుకోలేకపోయాడు. మంచి బడ్జెట్లో, బాగా టైం తీసుకుని అతను తీసిన ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.

ఈసారి ప్రశంసలతో పాటు భారీ నష్టం మిగిలింది నిర్మాతలకు. కమర్షియల్ ఫార్మాట్‌కు చాలా దూరంగా.. ట్రాజిక్ క్లైమాక్స్‌తో హార్డ్ హిట్టింగ్‌గా తీసిన ఈ చిత్రం మెజారిటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో దీని మీద పెట్టుబడి పెట్టిన నిర్మాతలు గట్టి దెబ్బే తిన్నారు.

ఈ దెబ్బతో వేణుకు టాలీవుడ్లో ఇంకో అవకాశం దక్కడం కష్టమే అనుకున్నారు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో వేణు అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. తొలి రెండు సినిమాల్లా సందేశాలు, సామాజికాంశాల జోలికి వెళ్లకుండా ఈసారి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేయడానికి వేణు రెడీ అవుతున్నాడట. ‘భీమ్లా నాయక్’ తరహాలో సితార బేనర్లో అతనో మల్టీస్లారర్ తీయనున్నాడట.

ఇది ఒక నడి వయస్కుడికి, ఒక కుర్రాడికి మధ్య సాగే పోరు నేపథ్యంలో సాగే సినిమా అట. చాలా ఇంటెన్స్‌గా కథ నడుస్తుందట. అదే సమయంలో కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా చూసుకోనున్నారట. స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు నటులు ఇందులో నటించాల్సి ఉందని.. అందులో ఒకరు తమిళం నుంచి ఉండొచ్చని కూడా అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచన కూడా చేస్తున్నారట. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.