సరైన సమయంలో సింహాద్రి ఎంట్రీ

సంక్రాంతి సినిమాల హడావిడిలో పాత రీరిలీజుల తాకిడి తగ్గింది కానీ త్వరలో మళ్ళీ మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డిలు అదరగొట్టగా మధ్యలో రెబెల్, వర్షం ఆశించిన స్పందన అందుకోలేదు. బిల్లా మాత్రమే పర్వాలేదనిపించుకుంది. ప్రేమదేశం, మాయాబజార్ లను ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వీటికి కాలం చెల్లిపోయిందనుకుంటున్న టైంలో ఏడాది చివర్లో ఖుషి ఊహించని రేంజ్ లో రికార్డుల ఊచకోత కోయడంతో కొత్త ఉత్సాహం వచ్చేసింది. ఇప్పుడీ లిస్టులోకి జూనియర్ ఎన్టీఆర్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ కూడా తోడవ్వబోతోంది.

మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రిని 4కె రీ మాస్టర్ చేసి సరికొత్త ప్రింట్ తో పునఃవిడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ కెరీర్ లో మొదటి ఇండస్ట్రీ హిట్ గా ఇరవై సంవత్సరాల క్రితం 2003లో ఇది నమోదు చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఎస్ఎస్ రాజమౌళి అనే కొత్త దర్శకుడికి మాస్ మీద ఎంత పట్టుందో కేవలం రెండో సినిమాతోనే ఋజువు చేసి ఔరా అనిపించుకుంది. కీరవాణి పాటలు, రమ్యకృష్ణ ఐటెం సాంగ్, గూస్ బంప్స్ తెప్పించే కేరళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఫైట్లు వెరసి సింహాద్రి మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చిన మాట వాస్తవం.

అంత పెద్ద ల్యాండ్ మార్క్ మూవీని రెండు దశాబ్దాల తర్వాత అది కూడా ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టైంలో సింహాద్రిని రీ రిలీజ్ చేయడమంటే మంచి స్ట్రాటజీనే. ఆ మధ్య బాద్షాని చేశారు కానీ కమర్షియల్ గా పెద్ద రేంజ్ మూవీ కాకపోవడంతో ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. కానీ సింహాద్రి అలా కాదు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత సోలో హీరోగా తారక్ ని స్క్రీన్ మీద చూసి నాలుగేళ్లు దాటేస్తున్న టైంలో ఇలాంటి బ్లాక్ బస్టర్ ఎంజాయ్ చేసే ఛాన్స్ వస్తే ఎందుకు వద్దనుకుంటారు. టైం చాలానే ఉంది కానీ అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే హడావిడి మొదలుపెట్టేశారు.