అప్పుడు క్యాన్సర్.. పాపం ఇప్పుడేమో

అందమైన హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడి.. కళావిహీనంగా తయారైతే అభిమానులు వారిని చూసి తట్టుకోవడం కష్టమే. సోనాలి బింద్రే సహా చాలామంది హీరోయిన్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. దక్షిణాది హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. ఈ మలయాళ భామ తెలుగులో ఒక టైంలో వరుసగా క్రేజీ సినిమాల్లో నటించింది.

కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. ఆమె క్యాన్సర్ బారిన పడి సినిమాలకు దూరమైంది. అదృష్టం కొద్దీ ఆ మహమ్మారి నుంచి కొంచెం త్వరగానే కోలుకుంది. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నపుడు మీడియా దృష్టిలో పడకుండా ఉన్న ఆమె.. మళ్లీ మామూలు మనిషయ్యాక లైమ్ లైట్లోకి వచ్చింది. తిరిగి సినిమాల్లో కూడా నటించింది. మళ్లీ ఆమెను మునుపటి గ్లోతో చూడడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది.

కానీ ఇప్పుడు మమత మళ్లీ ఓ వ్యాధి బారిన పడింది. ఈసారి సమస్య మరీ పెద్దది కాదు కానీ.. మమతను బాగా ఇబ్బంది పెడుతున్నదే. ఒక చర్మ సంబంధిత సమస్య కారణంగా శరీరమంతా పొడిబారిపోయి.. తెల్లటి మచ్చలు వచ్చేస్తున్నాయట. మామూలుగా హీరోయిన్లకు ఇలాంటి సమస్య ఎదురైతే బయటికి చెప్పుకోరు. కానీ మమత మాత్రం ఒంటి మీద తెల్లటి మచ్చలతో కళ తప్పిన తన బాడీని చూపించడానికి వెనుకాడలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను షేర్ చేసి.. సమస్య గురించి చెప్పేసింది.

ఎండ తగలడం కోసం ఆరుబయట కూర్చున్న ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘‘ఓ సూర్యుడా.. నాకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ నీ కాంతి అవసరం. నేను నా రంగును కోల్పోతున్నా. నేను ప్రతి రోజూ నీ కోసం ఎదురు చూస్తుంటా. సూర్యకిరణాలు తాకాలని బయటికి వస్తున్నా. ఇప్పుడు నాకు నీ అవసరం చాలా ఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నా. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొంది.

ప్రస్తుతం తన సమస్యకు చికిత్స తీసుకుంటున్న మమత.. క్యాన్సర్‌ను జయించినట్లే ఈ వ్యాధినీ అధిగమిస్తుందని ఆశిద్దాం.