సంక్రాంతి విజేత ఎవరు?

మొత్తానికి సంక్రాంతి సినిమాలన్నీ థియేటర్లలోకి దిగేశాయి. ఈసారి ఏకంగా ఐదు చిత్రాలు నాలుగు రోజుల వ్యవధిలో విడుదల కావడం విశేషం. అందులో రెండు డబ్బింగ్ బొమ్మలు కాగా.. మూడు తెలుగు సినిమాలు. పేరుకు ఐదు సినిమాలు బరిలో దిగినా.. ప్రధానంగా అందరి దృష్టీ నిలిచింది మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ల మీదే. సంక్రాంతి విజేత ఈ రెండు చిత్రాల్లో ఒకటే అవుతుందని అందరూ అంచనా వేశారు.

డబ్బింగ్ సినిమాల మీద అంచనాలు అంతంతమాత్రమే కాగా.. చిన్న సినిమా అయిన ‘కళ్యాణం కమనీయం’ కంటెంట్ పరంగా బెస్ట్ మూవీ అవుతుందేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే అనువాద చిత్రాలు ‘వారసుడు’, ‘తెగింపు’ అంచనాలకు తగ్గట్లే తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. రెంటికీ తొలి రోజు ఓపెనింగ్స్ ఓ మోస్తరుగా వచ్చాయే తప్ప కంటెంట్ పరంగా ఇవి ఆకట్టుకోలేకపోయాయి. ఇక ‘కళ్యాణం కమనీయం’ అంచనాలకు భిన్నంగా సాధారణ చిత్రం అని తేలిపోయింది.

ఇక మిగిలిన రెండు పెద్ద సినిమాల విషయానికి వస్తే.. రెంటికీ డివైడ్ టాకే వచ్చింది. గురువారం సోలోగా రిలీజ్ కావడం వల్ల ‘వీరసింహారెడ్డి’కి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ సినిమా రెండో రోజు ఒక్కసారిగా డౌన్ అయింది. థియేటర్లు తగ్గిపోవడం, ‘వాల్తేరు వీరయ్య’ నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో బాలయ్య సినిమా జోరు కొనసాగించలేకపోయింది. చిరు సినిమాకు కూడా ‘వీరసింహారెడ్డి’ లాగే డివైడ్ టాక్ వచ్చినా సరే.. ఆ సినిమా తొలి రోజు నుంచి నిలకడగా వసూళ్లు సాధిస్తోంది.

చిరు వింటేజ్ లుక్స్, కామెడీకి అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు బాగా కనెక్టవుతున్నట్లున్నారు. ఈ సినిమా రెండో రోజు కూడా స్టడీగా నిలబడింది. మూడో రోజు కూడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సోమవారం కూడా బాక్సాఫీస్ పరీక్షకు గట్టిగా నిలబడితే సినిమా పెద్ద రేంజికి వెళ్లడం ఖాయం. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే ‘వాల్తేరు వీరయ్య’నే సంక్రాంతి విజేత అన్నది స్పష్టమవుతోంది.