‘ఇంటి వివాదం’పై ఓపెన్ అయిన చిరు


మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక, ఆ తర్వాత ఆయన గురించి తరచుగా వినిపిస్తూ వచ్చిన విమర్శ.. తన సొంత ఊరు మొగల్తూరుకు ఏమీ చేయలేదని. అక్కడ ఉన్న తన ఇంటిని లైబ్రరీ కోసం అడిగినా ఇవ్వలేదని.. దాన్ని అమ్ముకున్నారని స్థానికులు విమర్శిస్తుంటారు. దీని గురించి చిరంజీవి ఇప్పటిదాకా ఎన్నడూ వివరణ ఇచ్చింది లేదు.

ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరు ఈ విమర్శలకు తన సమాధానమేంటో చెప్పేశారు. అందరూ అనుకుంటున్నట్లు అసలు ఆ ఇల్లు చిరు సొంతం కాదట. దాన్ని అమ్ముకున్నది కూడా చిరు కాదట. దీని వెనుక కథాకమామిషు ఏంటో చిరు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

“మొగల్తూరులో నేను పెరిగిన ఇంటిని కేవలం 3 లక్షల రూపాయలకు అమ్మేశానని, లైబ్రరీకి అడిగితే ఇవ్వలేదని ప్రచారం జరగడం నేనూ విన్నాను. నేను ఎలాంటి వాడినో.. ఎన్ని కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నానో తెలిసిన వాళ్లు దీన్ని ఎందుకు నమ్ముతారో అర్థం కాదు. వాస్తవం ఏంటంటే.. మొగల్తూరు మా సొంత ఊరు కాదు. అది మా అమ్మమ్మ వాళ్ల ఊరు. అక్కడే నేను పెరిగాను. ఐతే నేను నివసించిన ఇల్లు మాది కాదు. మా అమ్మ సోదరుడైన మా మావయ్యది. ఆయనొక బ్యాంకు ఉద్యోగి. నేను పెరిగిన ఇల్లు కాబట్టి అందరూ అది నా ఇల్లు అనుకుని అభిమానులు ఎమోషనల్ అవుతుంటారు. ఇప్పటికీ ఆ ఇంటికి వెళ్తుంటారు. కానీ ఆ ఇంటిపై నాకు ఎలాంటి హక్కు లేదు. మా మావయ్యే ఆ ఇంటిని అమ్మేశారు. లైబ్రరీ కోసం ఆ ఇంటిని ఇవ్వమని నన్నయితే ఎవ్వరూ అడగలేదు. నిజానికి నా మిత్రుడి ద్వారా ఆ ఊరిలో లైబ్రరీ అభివృద్ధికి నేనే సాయం చేశా. నేను ఎలాంటి తప్పూ చేయను. నేను రాజకీయాల్లోకి వచ్చాక నా నుంచి తప్పులు ఎంచడానికి ఏమీ లేక ఇలాంటివి ప్రచారం చేస్తుంటారు. నాకు సంబంధం లేని విషయానికి నేనసలు ఎందుకు వివరణ ఇవ్వాలని ఊరుకున్నా. కానీ దాన్నే అలుసుగా తీసుకున్నారు” అని చిరు వివరించాడు.