సుమ గేమ్ షోకి మెగాస్టార్ వెళ్లడం రైటేనా

సినిమా ప్రమోషన్ల విషయంలో మెగాస్టార్ చిరంజీవి పెద్దగా మొహమాటపడరు కానీ అవి ఏవైనా సరే ఆయన స్థాయికి తగ్గట్టే ఉండాలని అభిమానులు ఆశిస్తారు. కొన్నేళ్ల క్రితం మీలో ఎవరు కోటీశ్వరుడులో యాంకర్ గా చేసినప్పుడు మెగా ఫ్యాన్స్ నుంచే కొంత వ్యతిరేకత వచ్చింది. రాజకీయాలకు బ్రేక్ అప్ చెప్పి తిరిగి కంబ్యాక్ ఇస్తున్నప్పుడు ఇలాంటి క్విజ్ షోలు చేయడం ఏమిటనే కామెంట్లు గట్టిగానే వినిపించాయి. వాళ్ళ భయానికి తగ్గట్టే చిరు నడిపించిన సిరీస్ అంతగా సక్సెస్ కాకపోవడంతో అది నాగార్జున చేతికి వెళ్లిపోయింది. సో మెగాస్టార్ రేంజ్ ని ఆయన కాదు ఫాలోయర్స్ డిసైడ్ చేసి పెట్టారు.

తాజాగా యాంకర్ సుమ నిర్వహించే కొత్త గేమ్ షో అడ్డాకు చిరు బోణీ అతిథిగా హాజరయ్యారు. వాల్తేరు వీరయ్య కోసం దర్శకుడు బాబీతో కలిసి ఇందులో పాల్గొన్నారు. త్వరలో సంక్రాంతి సందర్భంగా ప్రసారం కానుంది. మాములుగా సుమ చేసే ప్రోగ్రాంస్ కి గతంలో చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ కు రాకపోయినా బ్రహ్మాస్త్ర కోసం రన్వీర్ కపూర్ అలియా భట్ లతో రాజమౌళి వచ్చాడు. చిన్నా చితక హీరోలు డైరెక్టర్లు లెక్కలేనంత మంది షోకి కలర్ ఇచ్చారు.అయితే నలుగురు అగ్ర సీనియర్లలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎప్పుడూ ఇలాంటి సరదా షోకి వచ్చిన దాఖలాలు లేవు.

ఇక్కడ సుమ స్థాయి పెరిగిందా లేక చిరు తన మూవీ కోసం ఓ మెట్టు దిగారా అనేది సమాధానం కష్టమే కానీ దీన్ని నిర్మిస్తున్న మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి మెగాస్టార్ తో ఉన్న అనుబంధమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దానికి తోడు సుమలో చలాకి యాంకరింగ్ ని పలు సందర్భాల్లో మెచ్చుకున్న చిరంజీవికి ఇప్పుడో సరికొత్త అనుభూతి దక్కనుంది. ఇది రెగ్యులర్ ఇంటర్వ్యూ కాదు కాబట్టి ఆయన గౌరవానికి తగ్గట్టు సుమ ఎలాంటి గేమ్స్ ఆడిస్తుంది, ఏఏ ప్రశ్నలు అడుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. షూటింగ్ పూర్తి చేసుకుంది కాబట్టి ఆల్రెడీ దీని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేశాయి .