నాగ్‌తో అనుకున్న సినిమా వేరేవాళ్లతో..?

కోలీవుడ్లో మల్టీ టాలెంట్ ఉన్న హీరోల్లో ధనుష్ ఒకడు. అతను కేవలం నటుడు మాత్రమే కాదు.. సింగర్, లిరిసిస్ట్, రైటర్, డైరెక్టర్. అన్ని రకాలుగానూ తన టాలెంట్ ఏంటో చూపించాడు. ‘పవర్ పాండి’ సినిమాతో రైటర్ కమ్ డైరెక్టర్‌గా ధనుష్ తన అభిరుచిని చాటుకున్నాడు. సీనియర్ నటుడు రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా మంచి హిట్టయింది. అందులో రాజ్ యంగ్ ఏజ్ క్యారెక్టర్ని ధనుషే చేశాడు.

ఈ సినిమా తర్వాత కొంచెం పెద్ద బడ్జెట్లో, భారీ కాన్వాస్‌లో ‘రుద్ర’ అనే సినిమా చేయడానికి ధనుష్ కొన్నేళ్ల ముందు రంగం సిద్ధం చేసుకున్నాడు. తనే ముఖ్య పాత్ర పోషిస్తూ.. నాగార్జున, అరవింద్ స్వామి లాంటి సీనియర్ నటులను కీలక పాత్రలకు ఎంచుకున్నాడు. ఈ సినిమాకు అంతా ఓకే చేసుకుని, ఇక షూటింగ్‌కు వెళ్లడమే ఆలస్యం అనుకున్నారు.

కానీ ఏం జరిగిందో ఏమో.. ఉన్నట్లుండి ఆ చిత్రానికి బ్రేక్ పడింది. బహుశా బడ్జెట్ సమస్యల వల్లే సినిమా ఆగిపోయి ఉంటుందని ప్రచారం జరిగింది. కొన్నేళ్ల పాటు దర్శకత్వం ఊసే ఎత్తని ధనుష్.. ఇప్పుడు మళ్లీ తన డ్రీమ్ ప్రాజెక్టును బయటికి తీస్తున్నట్లు సమాచారం. ధనుష్ కోరుకున్న బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీయడానికి సన్ పిక్చర్స్ వాళ్లు ముందుకు వచ్చారట. కాకపోతే ఈసారి కాస్టింగ్ అంతా మారిపోతున్నట్లు తెలుస్తోంది.

నాగ్, అరవింద్ స్వామి సహా ఇంతకుముందు అనుకున్న ఆర్టిస్టులందరినీ మార్చేస్తున్నారట. ఎస్.జె.సూర్య, విష్ణు విశాల్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తారట. వీరికి తోడు ధనుష్ కూడా నటిస్తాడట. కథను కూడా కొంచెం మార్చి కొత్త టైటిల్‌తో రంగంలోకి దిగనున్నాడట ధనుష్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధనుష్.. ‘కెప్టెన్ మిల్లర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. వెంకీ అట్లూరితో చేసిన ‘సార్’ విడుదలకు సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ములతో ఇటీవలే ధనుష్ ఓ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.