శివరాత్రి సినిమాలకు శాకుంతలం చిక్కు

ఇవాళ హఠాత్తుగా శాకుంతలం విడుదల తేదీని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు సమర్పణలో ఎస్విసి బ్యానర్ పై గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో సమంతా హీరోయిన్. పేరుకి ఇతిహాస ప్రేమకథే అయినప్పటికి త్రీడి వెర్షన్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17ని ఫిక్స్ చేస్తూ ఇందాక అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సామ్ కు జోడిగా దేవ్ మోహన్ హీరోగా నటించగా మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ దీంతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని ప్రత్యేకతలు ఈ సినిమాకున్నాయి.

అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ శాకుంతలం వల్ల మరో మూడు చిత్రాలు చిక్కుల్లో పడ్డట్టే. అందులో మొదటిది గీతా ఆర్ట్స్ 2 సంస్థ నుంచి వస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ. కిరణ్ అబ్బవరం మార్కెట్ చిన్నదే అయినప్పటికీ దీనికి బడ్జెట్ బాగానే కేటాయించి ఏదో మంచి కంటెంట్ తోనే తెరకెక్కించినట్టు ప్రమోషన్లు చూస్తే అర్థమవుతోంది. విశ్వక్ సేన్ తన డైరెక్షన్లోనే డ్యూయల్ రోల్ చేసిన ధమ్కీ అదే తేదీకి రానుంది. ధమాకాతో బ్లాక్ బస్టర్లో భాగమైన బెజవాడ ప్రసన్నకుమార్ రచన కావడంతో అంచనాలు పెరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇక ధనుష్ సర్ ని సితార టీమ్ ఎప్పుడో 17కి కర్చీఫ్ వేసింది. ఇవన్నీ ముందే లాక్ అయినవి.

ఉన్నట్టుండి శాకుంతలం వచ్చేయడంతో థియేటర్ల పరంగా చిక్కులు తప్పవు. సంక్రాంతికి వచ్చిన ఇబ్బందే మళ్ళీ తలెత్తుతుంది. ఇప్పుడంటే వారసుడు డబ్బింగ్ అయినా సరే పట్టువదలకుండా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న దిల్ రాజు స్ట్రెయిట్ మూవీ అయిన శాకుంతలంకి ఇంకే రేంజ్ ప్లానింగ్ చేస్తారో ఊహించుకోవచ్చు. అలాంటప్పుడు పైన చెప్పిన మూడింటిలో ఒకటి వాయిదానో ముందో వెనుకో రావడం చేయక తప్పదు. పైగా ఫిబ్రవరి 10న కళ్యాణ్ రామ్ అమిగోస్ ఉంది. దానికి స్క్రీన్లు రెండో వారానికే తగ్గించేయరు. మరి శివరాత్రి సినిమాలకొచ్చిన ఈ చిక్కు ఎలా తీరుతుందో చూడాలి.