ముందు ప్రేయసి.. తర్వాత భార్య.. ఇప్పడు వదిన


హీరోల పక్కన హీరోయిన్లుగా నటించిన అమ్మాయిలు.. తర్వాతి కాలంలో అక్క, వదిన పాత్రల్లోకి మారిపోతుంటారు. హీరోలు ఎంత కాలమైనా హీరోలుగానే కొనసాగుతారు కానీ.. హీరోయిన్లకు ఈ స్కోప్ ఉండదు. వాళ్ల కెరీర్ స్పాన్ పది పదిహేనేళ్లకు మించదు కాబట్టి.. ఏదో ఒక దశలో అక్క, వదిన తరహా పాత్రల్లోకి మారాల్సిందే. మోహన్ బాబు సరసన కథానాయికగా నటించిన వెన్నిరాడై తర్వాతి కాలంలో ఆయనకు తల్లిగా నటించడం విశేషం.

ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. రవితేజ సరసన ప్రేయసి, భార్య పాత్రలు పోషించిన శ్రుతి హాసన్.. ఇప్పుడు ఆయనకు వదిన పాత్రలో కనిపించబోతుండడం విశేషం. రవితేజ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బలుపు’లో ఆమె గర్ల్ ఫ్రెండ్ పాత్రను పోషించింది. తర్వాత వీరి కలయికలో ‘క్రాక్’ వచ్చింది. అందులో రవితేజకు భార్యగా నటించింది శ్రుతి. ఇప్పుడు ఆమె మాస్ రాజాకు వదినగా కనిపించబోతోంది.

‘వాల్తేరు వీరయ్య’లో శ్రుతి హాసన్.. చిరంజీవికి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. అతడిది చిరంజీవికి సవతి సోదరుడి పాత్ర అని సమాచారం. అంటే శ్రుతి హాసన్.. అతడికి వదిన కాబోతోందన్నమాట. ఇలా ఒక హీరో పక్కన ప్రేయసి, భార్య, వదిన పాత్రల్లో కనిపించిన హీరోయిన్లు తక్కువమందే ఉంటారు. సంక్రాంతికి అసలు సందడంతా శ్రుతిదే కాబోతోంది.

‘వాల్తేరు వీరయ్య’తో పాటు పండక్కి రిలీజవుతున్న మరో చిత్రం ‘వీరసింహారెడ్డి’లోనూ ఆమే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. ఇద్దరు టాప్ స్టార్ల సరసన శ్రుతి నటించిన సినిమాలు.. సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో ఒకేసారి విడుదల కావడం విశేషమే. ఆమె ఈ రెండు చిత్రాల ప్రమోషన్లలో ఇంకా పాల్గొనలేదు. వాటి ప్రి రిలీజ్ ఈవెంట్లలో సందడి చేయడమే కాక.. రెండు చిత్రాలకు కలిపి ఉమ్మడిగా మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వబోతోందట శ్రుతి. ఈ రెండు చిత్రాలనూ నిర్మించి మైత్రీ మూవీ మేకర్సే కావడంతో ఇలా ఉమ్మడి ఇంటర్వ్యూలివ్వడంలో ఆమెకు ఇబ్బందేమీ లేదు.