ప్రేక్ష‌కుల‌పై వ‌ర్మ క‌రుణ‌

Power Star

ఇప్ప‌టిదాకా క‌నీ వినీ ఎరుగ‌ని విధంగా ఒక సినిమా ట్రైల‌ర్ చూడ‌టానికి డ‌బ్బులు పెట్టాల్సి రావ‌డం ఇప్పుడే చూస్తున్నాం. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న ప‌వ‌ర్ స్టార్ సినిమాను త‌నే సొంతంగా పెట్టిన ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్లో వ‌ర్మ రిలీజ్ చేయ‌బోతుండ‌గా.. అంత‌కంటే ముందు రిలీజ్ చేయ‌బోతున్న ఈ సినిమా ట్రైల‌ర్ చూసేందుకు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌ర్మ క‌ల్పించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇందుకోసం రూ.50 ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ట్రైల‌ర్‌కు 50 రూపాయ‌లు పెట్టాలా అని అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు. ఐతే వ‌ర్మ తాను మ‌రీ అంత క‌ఠినాత్ముడిని కాద‌ని రుజువు చేసుకున్నాడు. ఆయ‌న ఎంతో ద‌య‌తో ఆ రేటును స‌గానికి స‌గం త‌గ్గించేశాడు. రూ.25 చెల్లిస్తే చాలు.. ప‌వ‌ర్ స్టార్ ట్రైల‌ర్ చూసేయొచ్చ‌ట‌. ఇక నేక్డ్ అనే నాసిర‌కం బూతు సినిమా చూసేందుకు ఏకంగా రూ.200 రేటు పెట్టిన వ‌ర్మ‌.. ప‌వ‌ర్ స్టార్ సినిమాకు టికెట్ రేటు త‌గ్గించేశాడు. రూ.150 ప్ల‌స్ జీఎస్టీ చెల్లిస్తే చాల‌ట‌. ఈ సినిమా చూసేయొచ్చు.

ఈ నెల 25న ఈ చిత్రాన్ని త‌న అర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వ‌ర్మ ప్ర‌క‌టించాడు. ఇంత‌కుముందు వ‌ర్మ త‌న రెండు సినిమాల‌ను శ్రేయాస్ మీడియా వారి ఏటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేశాడు. ఐతే దాని అధినేత శ్రేయాస్ శ్రీనివాస్ మెగా ఫ్యామిలీకి స‌న్నిహితుడు. ఇలాంటి వివాదాస్ప‌ద సినిమాను తాను రిలీజ్ చేస్తే ఇబ్బంది అని అత‌ను త‌ప్పుకున్నాడు. దీంతో వ‌ర్మే ప‌వ‌ర్ స్టార్ సినిమాను సొంతంగా రిలీజ్ చేయ‌డానికి పూనుకున్నాడు.