రాజుగారి చేతిలో వారసుడి గుట్టు

చూస్తుండగానే రోజులు కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతికి ఇంకా టైం ఉందనుకుంటుండగానే కౌంట్ డౌన్ పదిహేను రోజులకు వచ్చేసింది. ప్రమోషన్లు గట్రా చూసుకుంటూ ఉంటే ఇవి కూడా నీటి బుడగలా ఇట్టే పేలిపోతాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల పబ్లిసిటీని మైత్రి మూవీ మేకర్స్ చాలా జాగ్రత్తగా చేస్తోంది. ఎక్కువ తక్కువలు లేకుండా ఇద్దరి హీరోల అభిమానుల నుంచి సమస్యలు రాకుండా చూసుకుంటున్నా రెండు రోజుల క్రితం మెగా ఫ్యాన్స్ మీటింగ్ పెట్టి మరీ నిర్మాతకు తమ గోడు చెప్పుకోవడం, ఆయన ఎలాంటి ఇబ్బంది ఉండదని సర్దిచెప్పడం జరిగిపోయాయి.

వీటి సంగతి పక్కనపెడితే మొన్నటి దాకా థియేటర్ల గొడవ విషయంలో హైలైట్ అవుతూ వచ్చిన వారసుడు తెలుగు వెర్షన్ కు సంబంధించి ఎలాంటి సౌండ్ చేయడం లేదు. చెన్నైలో ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చేశాక హైదరాబాద్ తిరిగి వచ్చిన దిల్ రాజు ఇంకా మీడియాతో మాట్లాడేందుకు రెడీ కాలేదు. కేవలం ఒకటి రెండు ప్రైవేట్ ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్పించి ప్రింట్, వెబ్ ప్రతినిధులతో ఎప్పుడూ చేసే ఇంటరాక్షన్ ఇప్పటిదాకా ప్లాన్ చేయలేదు. ఈసారి చాలా హాట్ గా డిస్కషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రశ్నలను ముందే ఊహించి సమాధానాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

అందుకే దిల్ రాజు ఈ వ్యవహారాన్ని ఆలస్యం చేస్తునట్టు కనిపిస్తోంది. ఇక్కడో ఈవెంట్ చేస్తారో లేదో తెలియదు. విజయ్ ఒప్పుకున్నాడో లేదో లీక్ చేయడం లేదు. మరోవైపు థియేటర్ల పంపకాలు ఎక్కడి దాకా వచ్చాయో అంతుచిక్కక చిరు బాలయ్య ఫ్యాన్స్ అయోమయ పడుతున్నారు. పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ తెరవెనుక జరుగుతున్నది ఇంకా డిస్ట్రిబ్యూటర్లకే క్లారిటీ లేదు. మెయిన్ స్క్రీన్లకు సంబంధించి అగ్రిమెంట్లు జరిగాయి కానీ మిగిలినవాటికి రెండు మూడో రోజు ఏం చేయాలనే దాని మీద బయ్యర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. మరి రాజుగారు ఎప్పుడు ఓపెన్ అవుతారో చూడాలి.