కమెడియన్ చేపల పులుసు సూపర్ హిట్

జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న కమెడియన్లు చాలామంది జీవితంలో బాగానే స్థిరపడ్డారు. వారిలో కిరాక్ ఆర్పీ ఒకడు. నెల్లూరు యాసలో అతను జబర్దస్త్ స్కిట్లలో పండించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడ వచ్చిన పేరుతో పెద్ద ఎత్తున ఈవెంట్లు చేయడం.. వేరే షోల్లో, సినిమాల్లో కూడా అవకాశాలు రావడంతో అతడి దశ తిరిగిపోయింది.

ఐతే మిగతా కమెడియన్లలా కేవలం కామెడీకి పరిమితం అయిపోకుండా ఇటీవలే అతనో వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం.. కర్రీ పాయింట్ కావడం విశేషం. కర్రీ పాయింట్ ఏమైనా పెద్ద వ్యాపారమా అని తీసిపడేయకండి. అతను పెట్టింది మామూలు కర్రీ పాయింట్ కాదు. నెల్లూరు చేపల పులుసు మాత్రమే అమ్మే కర్రీ పాయింట్. ఆంధ్రా ప్రాంతాల్లో చేపల పులుసుకు ఫేమస్ అయిన వాటిలో నెల్లూరు ఒకటి. తన ఊరి టేస్టు మిగతా వాళ్లకు కూడా పరిచయం చేయడానికి అతను కొంచెం పెద్ద స్థాయిలోనే కర్రీ పాయింట్ పెట్టాడు.

రెస్టారెంట్ కాకుండా కేవలం టేక్ అవే.. అది కూడా చేపల పులుసు మాత్రమే అమ్మేలా కూకట్ పల్లిలో ఈ వ్యాపారం మొదులపెట్టాడు ఆర్పీ. అక్కడి నుంచి ఐదారు కిలోమీటర్ల అవతల కొంచెం గ్రామీణ టచ్ ఉన్న విశాలమైన ప్రాంతంలో పెద్ద కిచెన్ ఏర్పాటు చేశాడు. అక్కడ రెండంకెల సంఖ్యలో మనుషుల్ని పెట్టుకుని భారీగా కిచెన్ నిర్మించాడు. పెద్ద పెద్ద పాత్రల్లో నాటు స్టయిల్లో చేపల పులుసు వండించడం.. అవే పాత్రల్ని కూకట్ పల్లికి తీసుకెళ్లి కర్రీ పాయింట్లో అమ్మడం.. ఇలా నడుస్తోంది వ్యవహారం.

మొత్తం ఇందుకోసం రూ.40 లక్షల పెట్టుబడి పెడితే.. కేవలం నెల రోజుల్లో ఆ మొత్తం వెనక్కి వచ్చేసిందంటే ఈ వ్యాపరం ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈ నెల్లూరు చేపల పులుసుకు సంబంధించిన కర్రీ పాయింట్ ఫేమస్ అయిపోవడంతో మీడియా ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు ఆర్పీ వద్దకు వరుస కట్టేశాయి. ఈ కర్రీ పాయింట్ స్టోరీ ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లలో వైరల్ అవుతుండడం విశేషం.