మహేష్ ని బాధపెట్టిన భారీ డిజాస్టర్

సూపర్ స్టార్ గా తన ఇరవై ఏడేళ్ల సినిమాల్లో మహేష్ బాబుకి అన్ని రకాల ఫలితాలు కలగలసి ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఫ్లాప్ లు, యావరేజ్ లు ఇలా ఎన్నో. అయితే డిజాస్టర్ల విషయంలో తను అంత ఈజీగా రిసీవ్ చేసుకోలేడన్న సంగతి తెలిసిందే. అలా జరిగినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగి రిలాక్స్ అయ్యేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గుర్తే. అయితే ప్రిన్స్ ఇన్నేళ్ల కెరీర్ లో బాగా మనస్థాపం కలిగించిన మూవీ ఏదంటే ఫ్యాన్స్ ఠక్కున బాబీ అని చెబుతారేమో కానీ తనకు వ్యక్తిగతంగా డిస్ట్రబ్ చేసిన చిత్రం నాన్న కృష్ణతో కలిసి నటించిన, భార్య నమ్రతతో ప్రేమ చిగురులు తొడిగిన వంశీ అంటే షాక్ అవుతారేమో.

దీని వెనుక మహేషే స్వయంగా చెప్పిన అనుభవముంది. సోలో హీరోగా తన ప్రయాణం రాజకుమారుడుతో మొదలుపెట్టినప్పుడు మూడో సినిమా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో అది కూడా తండ్రి కాంబినేషన్ లో చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. అలా 2000 సంవత్సరంలో వంశీకి శ్రీకారం చుట్టారు. బి గోపాల్ లాంటి ప్రముఖ దర్శకుడికి బాధ్యత ఇచ్చారు. అయితే సరైన రీతిలో స్క్రిప్ట్ రూపుదిద్దుకోలేదు. ఎంత ప్రయత్నించినా అందరికీ నచ్చేలా ఒక కొలిక్కి రాకపోయినా హడావిడిగా షూటింగ్ మొదలుపెట్టేశారు. జరుగుతున్నంత సేపు మహేష్ లో ఏ మాత్రం ఎగ్జైట్ మెంట్ లేక ఇది ఖచ్చితంగా పోతుందని అర్థమైపోయింది.

ఫస్ట్ కాపీ వచ్చాక ప్రివ్యూ వేస్తే అందరూ హాజరయ్యారు. ఇంటర్వెల్ కాగానే మహేష్ ఇంటికి వెళ్ళిపోయి రూంలో ఒంటరిగా పడుకుని కళ్ళు మూసుకున్నాడు. బాధగా అనిపించింది. ప్రీమియర్ అయ్యాక ఫోన్లు వచ్చాయి చాలా బాగుందని. నవ్వుకున్నాడు. రిలీజయ్యాక వంశీ మాములు డిజాస్టర్ కాలేదు. తన జోస్యమే నిజమయ్యింది. ఆర్టిస్టుగా ఒక్క శాతం కూడా సంతృప్తి కలిగించని సినిమాగా వంశీని ఎప్పటికీ గుర్తుంచుకునేలా అయ్యింది. హాలీవుడ్ మూవీ ఎంఐ2 గ్రాఫిక్స్ అనుకరించిన తీరు మీద విమర్శలు రావడంతో అప్పటి నుంచి లోకల్ గ్రాఫిక్స్ వద్దనుకుని డిసైడ్ అయ్యాడట. ఇదంతా మహేష్ టక్కరి దొంగ షూట్ లో స్వయంగా చెప్పిన ఫ్లాష్ బ్యాక్.