కాంతారను కాపీ కొడితే నాశనమే

కాంతార.. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనాల్లో ఇది ఒకటి. సౌత్ ఇండియాలో మిగతా ఇండస్ట్రీల కంటే దిగువన ఉండే కన్నడ పరిశ్రమ నుంచి.. అక్కడి గ్రామీణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన కథకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

దీన్ని అసలు కన్నడేతర భాషల్లో, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే ఆలోచనే మేకర్స్‌కు లేదు. కానీ కన్నడలో విడుదలయ్యాక ఈ సినిమా పట్ల ఇతర భాషా ప్రేక్షకుల్లో అమితాసక్తి కనిపించడంతో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో అనువాదం చేసి రిలీజ్ చేస్తే అన్ని చోట్లా భారీ వసూళ్లు తెచ్చుకుంది.

కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా రూ.400 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ఈ సినిమా చూసి ఇలా మనమెందుకు తీయలేం అని ఇతర భాషల వాళ్లు ఆలోచిస్తున్నారు. ఐతే బాలీవుడ్ వాళ్లు ఇలా ఆలోచించడం చాలా తప్పు అంటున్నాడు అక్కడ టాప్ డైరెక్టర్లలో ఒకడైన అనురాగ్ కశ్యప్.

‘కాంతార’ లాంటి సినిమాను అనుకరించాలని, కాపీ కొట్టాలని చూస్తే బాలీవుడ్ నాశనం కాక తప్పదని.. ఇప్పటికే హిందీ పరిశ్రమ బాగా దెబ్బ తినడానికి అదే కారణమని అనురాగ్ తేల్చేశాడు. సైరాట్ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావడం మరాఠి ఇండస్ట్రీని నాశనం చేసిందంటూ ఆ చిత్ర దర్శకుడు నాగరాజ్ మంజులే చేసిన వ్యాఖ్యలను అనురాగ్ గుర్తు చేస్తూ.. ఒక సినిమా బాగా ఆడిందని అందరూ ఆ చిత్రాన్ని అనుకరించడం చేటు చేసినట్లు చెప్పాడు.

అలాగే దక్షిణాది చిత్రాలను బాలీవుడ్ అనుకరించడం వల్ల నష్టం జరుగుతోందని అనురాగ్ తెలిపాడు. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. దీంతో ఈ ట్రెండు మీదే బాలీవుడ్ దర్శక-నిర్మాతలు దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్‌ను నాశనం చేస్తోంది. పుష్ప, కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ అయి ఉండొచ్చు. కానీ అలాంటి బాలీవుడ్లో వర్కవుట్ కావు. వాటినే కాపీ కొట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీయాలని చూస్తే బాలీవుడ్‌కు భారీ నష్టం తప్పదు. ప్రస్తుతం బాలీవుడ్‌కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదు. పాన్ ఇండియా చిత్రాలు కాదు. కొత్తదనం ఉంటేనే సినిమాలు హిట్టవుతాయి’’ అని అనురాగ్ అన్నాడు.