రీమేక్‌లపై బాలీవుడ్ కన్ఫ్యూజన్

కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ చాలా వరకు రీమేక్ సినిమాలతోనే సాగిపోతోంది. సొంత కథలు కరువైపోయి.. దక్షిణాది నుంచి హిట్టయిన సినిమాలను తీసుకుని కొంచెం మార్చి తమ ప్రేక్షకులకు అందిస్తోంది. ఐతే ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలూ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమ్ అవుతుండడం.. కొన్ని చిత్రాలకు హిందీ ఆడియోలు కూడా అందుబాటులో ఉండడంతో.. మంచి టాక్ తెచ్చుకున్న ప్రతి సినిమానూ చూసేస్తున్నారు అక్కడి జనాలు. అవి చాలవన్నట్లు సౌత్ హిట్ సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో పెట్టేస్తున్నారు.

దీంతో రీమేక్‌ల పట్ల ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. ఉన్నదున్నట్లుగా తీసినా, మార్పులు చేర్పులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ ఏడాది బచ్చన్ పాండే, జెర్సీ, హిట్, విక్రమ్ వేద లాంటి రీమేక్ సినిమాలు హిందీలో రిలీజయ్యాయి. అవన్నీ కూడా దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. మంచి టాక్ తెచ్చుకుని కూడా ఈ సినిమాలేవీ నిలవకపోవడంతో బాలీవుడ్ జనాలకు కంగారు మొదలైంది.

ఇక రీమేక్ సినిమాలు కట్టి పెడితే తప్ప ఇండస్ట్రీ బాగుపడదనే అభిప్రాయాలు బాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ఇదే అభిప్రాయం బలపడుతున్న సమయంలో ఇప్పుడు ‘దృశ్యం-2’ వచ్చింది. ఇది మలయాళంలో అదే పేరుతో తెరకెక్కిన సీక్వెల్ మూవీకి రీమేక్. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఆ సినిమాలను హిందీ జనాలు ఏమేర చూశారో తెలియదు కానీ.. హిందీ ‘దృశ్యం-2’ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకైతే ఎగబడిపోతున్నారు. ఈ సినిమా వీకెండ్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్‌కు దక్కిన విజయమిది. ఈ సినిమా ఊపు చూస్తే మలయాళంలో జీతు జోసెఫ్-మోహన్ లాల్ కలిసి ‘దృశ్యం-3’ తీయడం ఆలస్యం మళ్లీ రీమేక్ చేసేలా ఉన్నారు. ఈ పరిణామం రీమేక్‌ల విషయంలో బాలీవుడ్‌ను గందరగోళానికి గురి చేస్తోందనడంలో సందేహం లేదు.