మహేష్ సినిమా.. రాజమౌళి క్లారిటీ


సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో అయినప్పటికీ.. దాని కంటే ఆ తర్వాత చేసే సినిమా మీద అభిమానుల దృష్టి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ సినిమా తీయబోయేది ఇండియాలో నంబర్ వన్ డైరెక్టర్ అనదగ్గ రాజమౌళి కాబట్టి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి మెగా సక్సెస్‌ల తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా కావడంతో దీని రేంజే వేరుగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘గ్లోబ్ టాటరింగ్’ అనే పదం వాడడం అందరినీ ఎగ్జైట్ చేసింది. తాజాగా ఒక వీడియో కాల్‌లో రాజమౌళి ఈ సినిమా గురించ మాట్లాడాడు. మహేష్ సినిమా స్టేటస్ ఏంటో పూర్తి స్పష్టత ఇచ్చేశాడు. ఈ సినిమాకు సంబంధించి రెండు నెలల కిందటే కథా చర్చలు మొదలైనట్లు చెప్పిన జక్కన్న.. ప్రచారంలో ఉన్నట్లే ఇదొక అడ్వెంచరస్ ఫిలిం అని ధ్రువీకరించాడు.

“నా తర్వాతి సినిమా మహేష్ బాబుతో అన్న విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమా కథా చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయి. రెండు నెలల కిందటే కథ పని మొదలైంది. నా సినిమాల్లో చాలా వాటికి కథ అందించిన మా నాన్న గారు.. నా కజిన్, నేను కోర్ టీంలో ఉన్నాం. ఇండియానా జోన్స్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి అడ్వెంచరస్ ఫిలిం చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. అలాగే డాన్ బ్రౌన్ నవలలన్నా కూడా నాకు చాలా ఆసక్తి ఉంది. వీటి స్ఫూర్తితో సినిమా చేయాలని చూస్తున్నాం. ఈ సినిమా గ్లోబ్ టాటరింగ్ అడ్వెంచరస్ ఫిలిం అని ఇంతకుముందే చెప్పా. కానీ కథకు సంబంధించి ఏదీ ఖరారు కాలేదు. మేం రకరకాల ఐడియాలను ఫిగర్ ఔట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం” అని రాజమౌళి చెప్పాడు.

జక్కన్న చెబుతున్నదాన్ని బట్టి కథా చర్చలు కొలిక్కి రావడానికి చాలా టైమే పట్టేలా ఉంది. త్రివిక్రమ్ సినిమాను మహేష్ పూర్తి చేసే సమయానికి స్క్రిప్టు రెడీ అవుతుందేమో. ప్రి ప్రొడక్షన్ అంతా అయ్యాక 2024 ఆరంభంలో సినిమా సెట్స్ మీదికి వెళ్లొచ్చనిపిస్తోంది.