డైరెక్ట్ ఓటిటిలో రష్మిక మజ్ను

ఈ మధ్య డైరెక్ట్ ఓటిటి రిలీజులు బాగా తగ్గిపోయాయి. జనాలు థియేటర్లకు వస్తున్నారన్న నమ్మకం కుదరడంతో నిర్మాతలు డిజిటల్ వైపు అంతగా మొగ్గు చూపడం లేదు. ఇది అగ్ర నిర్మాతల వైపు జరుగుతున్న పరిణామం. చోటా ప్రొడ్యూసర్లకు మాత్రం ఓటిటిలు పెడుతున్న కండీషన్లు, ఆఫర్ చేస్తున్న రేట్లు మరీ అన్యాయంగా ఉంటున్నాయి. అందుకే తప్పని పరిస్థితుల్లో తమ చిత్రాలకు మార్కెట్ లేదని తెలిసి కూడా బిగ్ స్క్రీన్ విడుదలకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్న ఒక క్రేజీ మూవీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సాహసమే.

సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందిన మిషన్ మజ్నుని నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకుంది. 2023 జనవరి ప్రీమియర్ కు ప్లానింగ్ జరుగుతోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్. నిజానికిదే తన బాలీవుడ్ డెబ్యూ. నిర్మాణం ఆలస్యం కావడంతో దీనికన్నా ముందు అమితాబ్ బచ్చన్ కూతురిగా నటించిన గుడ్ బై విడుదలయ్యింది. శంతను భాగ్ఛీ దర్శకత్వంలో రూపొందిన ఈ మిషన్ మజ్ను ఒక స్పై థ్రిల్లర్. ఇటీవలి కాలంలో ఈ జానర్ లో చాలా సినిమాలు వచ్చాయి. అఖిల్ ఏజెంట్ కూడా ఈ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నదే. కార్తీ హిట్టు కొట్టిన సర్దార్ లో సైతం హీరో గూఢచారినే.

హఠాత్తుగా ఈ మిషన్ మజ్ను ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమైనా నార్త్ ఆడియన్స్ లో రెగ్యులర్ కంటెంట్ పట్ల ఏర్పడుతున్న వ్యతిరేకతే కారణంగా విశ్లేషకులు భావిస్థున్నారు. కేవలం క్యాస్టింగ్ ని బట్టో ట్రైలర్ లో విజువల్స్ బట్టో జనం రావడం లేదని అర్థమవుతోంది. అందుకే మిషన్ మజ్ను అవుట్ ఫుట్ బాగున్నా లేకపోయినా ఇది థియేటర్ లో రిసీవ్ చేసుకుంటారో లేదోననే అనుమానంతో పాటు నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన టెంప్టింగ్ ఆఫర్ కి నిర్మాతలు ఎస్ చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ దీని డబ్బింగ్ వెర్షన్ ని స్ట్రీమింగ్ చేస్తారు.