బెల్లంకొండ బ్రదర్.. ఫోన్ గొడవ

మామూలుగా ఇండస్ట్రీలోకి ఏ వారసుడు హీరోగా అడుగు పెట్టినా మంచి మాస్ మసాలా సినిమా మీదే దృష్టిపెడతాడు. కానీ బెల్లంకొండ గణేష్ మాత్రం దానికి భిన్నంగా స్వాతిముత్యం అనే కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్‌తో ఎంట్రీ ఇచ్చాడు. తన అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ ఆరంభం నుంచి మాస్ మసాలా సినిమాలే చేసిన నేపథ్యంలో గణేష్ మాత్రం దానికి భిన్నంగా అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే తొలి చిత్రం గణేష్‌కు మిశ్రమ అనుభూతి మిగిల్చింది.

ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆహా ఓటీటీలో చూసి సినిమాను కొనియాడిన వాళ్లంతా సినిమాలో మిగతా ఆర్టిస్టులను పొగిడినట్లు గణేష్‌ను పొగడలేదు. ఇలాంటి సినిమాతో హీరోగా అరంగేట్రం చేసినందుకు అభినందించారే తప్ప నటన పరంగా అతడికి మంచి మార్కులు వేయలేదు. కట్ చేస్తే ఇప్పుడు గణేష్ రెండో సినిమాతో రెడీ అయిపోయాడు. ‘నేను స్టూడెంట్ సార్’ అనే చిత్రంతో అతను మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

‘నాంది’ సతీశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని రాకీ ఉప్పలపాటి డైరెక్ట్ చేశాడు. ఈ రోజే దీని టీజర్ లాంచ్ అయింది. తొలి సినిమాలాగే ఈసారి కూడా కొంచెం భిన్నమైన సినిమానే ఎంచుకున్నట్లున్నాడు గణేష్. ఇది మొత్తం ఒక ఐఫోన్ చుట్టూ తిరిగే సినిమా కావడం విశేషం. ఎంతో ఇష్టపడి హీరో కొనుక్కున్న ఫోన్ పోతుంది.

దాని మీద కంప్లైంట్ చేయడానికి అతను కమిషనర్ ఆఫీసుకు వస్తాడు. ఫోన్ పోతే పోలీస్ స్టేషన్లో కదా కంప్లైంట్ చేయాల్సింది అంటే.. తన ఫోన్ కొట్టేసిందే పోలీసులు అంటూ షాకిస్తాడు. ఇంతకీ పోలీసులేంటి.. హీరో ఫోన్ కొట్టేయడమేంటి అంటే.. ఇదంతా ఒక ట్రాప్ అయి ఉండొచ్చని అనిపిస్తోంది. టీజర్ వరకు అయితే ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తించేలా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో.. గణేష్‌కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి.