అమితాబ్ ఓకే.. అభిషేక్‌కు ఏమైంది?

కరోనా ముందు ఎంత పెద్ద వాళ్లయినా తల వంచాల్సిందే అని మరోసారి రుజువైంది. బయటికి వెళ్లాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరమే పడని.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ సైతం కరోనా బాధితుడిగా మారారు.

ఆయనే కాదు.. కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆద్య సైతం కరోనా బారిన పడ్డారు. వీరి పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా 77 ఏళ్ల వయస్కుడైన అమితాబ్ గురించి టెన్షన్ పడుతున్నారు. ఆయనతో పాటు అభిషేక్ కూడా ముంబయిలో అంబానీ వారి ప్రఖ్యాత కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

వీళ్లిద్దరికీ పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే ఐశ్వర్య, ఆద్య కూడా కరోనా బారిన పడ్డట్లు వెల్లడైంది. వీళ్లిద్దరూ కూడా ఆసుపత్రికి వెళ్లగా.. వీరికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో ఇంటికే పరిమితం కావాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లీకూతుళ్లిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. అక్కడే రెండు వారాల పాటు హోం క్వారంటైన్లో ఉండబోతున్నారు.

అభిషేక్ కూడా ఇంటికి వచ్చేస్తున్నట్లు ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాదని తేలింది. తండ్రితో పాటు తాను కూడా ఆసుపత్రిలో ఉండాల్సిందే అని వైద్యులు చెప్పారని అభిషేక్ స్వయంగా ట్వీట్ చేశాడు. అమితాబ్ పెద్ద వయస్కుడు కాబట్టి జాగ్రత్త కోసం ఆసుపత్రిలోనే పెట్టి ఉండొచ్చు. కానీ అభిషేక్ ఎందుకు ఆసుపత్రిలోనే ఉంటున్నాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఐతే అతడికి దగ్గు, జ్వరం ఉన్నాయని.. అవి నియంత్రణలోకి వచ్చాక ఇంటికి పంపాలని వైద్యులు నిర్ణయించారని, ఆందోళన ఏమీ అక్కర్లేదని బచ్చన్ కుటుంబ వర్గాలు తెలిపాయి. అమితాబ్‌ నెగెటివ్ వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉండి, ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు.